కమల దళపతి వెంటే.. అగ్రనాయకులు! భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు గాంధీనగర్ లోక్సభ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేయనున్నారు. కాషాయ దళపతికి మద్దతుగా పార్టీ అగ్రనాయకులు తరలిరానున్నారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా మిత్రపక్షాల అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాశ్ సింగ్ బాదల్, రామ్ విలాస్ పాసవాన్ హాజరుకానున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ విషయంలో అమిత్ షాకు పూర్తి మద్దతుందని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నామపత్ర దాఖలుకు ముందు నరాన్పురాలోని సర్దార్ పటేల్ విగ్రహం నుంచి పాటీదార్ చౌక్ వరకు 4 కి.మీ మేర రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అడ్వాణీని కాదని..!
1998 నుంచి గాంధీనగర్ స్థానంలో భాజపా అగ్రనేత అడ్వాణీదే గెలుపు. అలాంటి ప్రతిష్టాత్మక స్థానంలో అడ్వాణీని కాదని తొలిసారి భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు సీటు కేటాయించింది పార్టీ. ఇంతకుముందు షా గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.