తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నేటి సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారానికి తెర'

రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 97 లక్షలకు పైగా ఓటర్లకు 34వేల 604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

By

Published : Apr 9, 2019, 4:53 AM IST

'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలకు 72 గంటల ముందు నుంచి ప్రొటోకాల్‌ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు 48గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు సామూహిక ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి లేదన్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుందని, సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు.

నిజామాబాద్​లో 8గంటల నుంచి పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 34,604 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు, అందులో 6 వేల 445 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామని, అనంతరం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.

ఓటర్ కార్డుతోనే కాదు మరో 11 కార్డులతోనూ ఓటేయొచ్చు

రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 97 లక్షల 8 వేల 599 మంది ఓటర్లున్నట్లు రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో 1 కోటి 49 లక్షల 30 వేల 726 మంది పురుషులు కాగా... 1 కోటి 47 లక్షల 76 వేల 370 మంది స్త్రీలు. అంతేకాకుండా 1504 మంది ఇతరులు, 11 వేల 320 సర్వీస్ ఓటర్లు , 1731 మంది ఎన్నారైలు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేవలం ఓటర్‌ కార్డుతోనే కాకుండా మరో 11 గుర్తింపు కార్డులతో కూడా ఓటు వేయవచ్చని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇప్పటివరకు మొత్తం 52 కోట్ల 61 లక్షల 57 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇందులో 45.18 కోట్లు నగదు, 4 కోట్ల 9 లక్షల లీటర్ల మద్యం, 2.75 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి ఉన్నాయి. సీవిజిల్ ద్వారా 1430 ఫిర్యాదులు అందినట్లు అందులో రెండు తప్ప అన్ని పరిష్కారమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం నారాయణగూడలో 8 కోట్ల నగదు పట్టుబడిందని దానిపై పూర్తి విచారణ జరుపాల్సి ఉందని సీఈవో చెప్పారు.

పోలింగ్ రోజు సెలవివ్వకపోతే కఠిన చర్యలు తప్పవు

ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారన్న కాంగ్రెస్ ఫిర్యాదును ఎన్నికల సంఘానికి నివేదించినట్లు ఈసీ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి అయన నుంచి నివేదిక తీసుకుని ఈసీకి పంపామని తెలిపారు. పోలింగ్ రోజు అన్ని ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందేనని లేనిపక్షంలో కార్మిక చట్టాల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రజత్ కుమార్ హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు
2 కోట్ల 97 లక్షల 8 వేల 599
1 కోటి 49 లక్షల 30 వేల 726 మంది పురుషులు
1 కోటి 47 లక్షల 76 వేల 370 మంది స్త్రీలు
1504 మంది ఇతరులు, 11 వేల 320 సర్వీస్ ఓటర్లు, 1731 మంది ఎన్నారైలు

పట్టుబడిన నగదు
52 కోట్ల 61 లక్షల 57 వేలకు పైగా నగదు స్వాధీనం
45.18 కోట్ల నగదు, 4.9 కోట్ల లీటర్ల మద్యం, రూ.2.75 కోట్ల విలువ చేసే గంజాయి
సీవిజిల్ ద్వారా 1430 ఫిర్యాదులు

'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'


ఇవీ చూడండి: 'తెరాస, వైకాపా కలిసి 36 సీట్లు గెలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details