Yuva Nidhi Scheme Karnataka 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఐదు గ్యారెంటీల్లో 'యువనిధి' పథకం ఒకటి. ఈ పథకం కింద నిరుద్యోగులకు అంటే డిగ్రీ పూర్తి చేసినవారికి నెలకు రూ.3వేలు, డిప్లొమా చదివిన వారికి రూ.1,500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ఆ పార్టీ. ఇలాంటి మరికొన్ని హామీలతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ 'యువనిధి' పథకానికి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను 2023 డిసెంబరు 26 నుంచి ఆహ్వానించింది. అర్హులైన నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. అయితే 'యువనిధి' పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభమై వారం అవుతున్నా ఇప్పటివరకు 19,800 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. యువనిధి పథకానికి అంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం పట్ల అధికారులు సైతం విస్తుపోతున్నారు.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో 'యువనిధి' పథకానికి రూ.250 కోట్లు కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.1,250 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. అర్హులు సేవాసింధు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో నాలుగింటికి రిజిస్ట్రేషన్ సమయంలో విశేష స్పందన వచ్చింది. ఆ పథకాలకు ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొన్నిసార్లు సర్వర్ కూడా డౌన్ అయ్యింది. అయితే యువనిధి పథకానికి మాత్రం అంతగా స్పందన రాలేదని ప్రభుత్వ అధికారి ఒకరి తెలిపారు.