కరోనా విజృంభిస్తున్న వేళ అవసరమైన దేశాలకు టీకాలను పంపిణీ చేయాలని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచ దేశాలను కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ సెషన్లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్.. కరోనాను జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కొవిడ్ పోరాటంలో భారతదేశానికి తమ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.
భారత్.. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా భావించి ఇతర దేశాలకు 67 మిలియన్ కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా కొవిడ్పై పోరుకు వ్యాక్సిన్ల విషయంలో ఉదారత చూపాలని పేర్కొన్నారు. ప్రపంచ మేథో సంపత్తి హక్కులను భారత్ గౌరవిస్తుందని, ఇకముందూ కొనసాగిస్తుందని చెప్పారు.