Woman duping case: పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో కేటుగాళ్ల మాయలోపడుతున్నారు కొందరు. బ్యాంకులో నగదు ఫ్రీజ్ అయింది.. ట్యాక్సులు కడితే డబ్బులు వస్తాయని చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా రూ.55,000 కోట్లు వచ్చాయని కట్టుకథ అల్లి ఓ మహిళను మోసం చేశారు కొందరు దుండగులు. అందులో 40శాతం షేర్ ఇస్తామని, అందుకు ఆర్బీఐకి రూ. 27 కోట్లు ట్యాక్స్ కట్టాలని నమ్మించి టోకరా వేశారు.
ఇదీ జరిగింది..
ఈనెల 5వ తేదీన బాధిత మహిళ.. భాస్కర రావు యోసుపోగు అనే వ్యక్తిని జుహు ప్రాంతంలోని ఓ హోటల్లో కలిసింది. ఈ క్రమంలో కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా తమకు 6.7 బిలియన్ యూరోలు వచ్చాయని(సుమారు రూ.55వేల కోట్లు) ఆమెను నమ్మించారు. ఈ నగదును ఆర్బీఐలోని విదేశీ వ్యవహారాల విభాగం నిలిపివేసిందని, ఆ డబ్బులు రావాలంటే రూ.27 కోట్లు ట్యాక్స్ కట్టాలని చెప్పారు. ఆ డబ్బులు ఇస్తే.. వచ్చే నగదులో 40శాతం షేర్ ఇస్తామన్నారు. దుండగుల మాయలో పూర్తిగా మునిగిపోయిన మహిళ.. తన వద్ద ఉన్న రూ.30,000 వారికి ఇచ్చింది. మిగిలిన డబ్బులను గురువారం ఇస్తానని చెప్పింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు.. ఇది పెద్ద స్కామ్ అని చెప్పటంతో మోసపోయానని తెలుసుకుని భందుప్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420,465, 467, 468, 471, 120(బీ), 34 ప్రకారం కేసు నమోదు చేశారు.