తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కార్మికుల దాడితో విస్ట్రాన్​కు రూ.437 కోట్ల నష్టం' - కర్ణాటక వార్తలు

కర్ణాటకలోని విస్ట్రాన్​ కార్పొరేషన్​ ఐఫోన్​ తయారీ పరిశ్రమలో ఉద్యోగుల దాడి వల్ల సుమారు రూ.437 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది సంస్థ. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 149 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

Wistron corporation
విస్ట్రాన్​ కార్పొరేషన్​ ఐఫోన్​ తయారీ పరిశ్రమ

By

Published : Dec 14, 2020, 7:01 PM IST

వేతనాలు చెల్లించటం లేదంటూ కర్ణాటక కోలార్ జిల్లాలోని విస్ట్రాన్​ కార్పొరేషన్​ ఐఫోన్​ తయారీ పరిశ్రమలో ఉద్యోగులు విధ్వంసానికి దిగిన ఘటనలో సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.437.40 కోట్ల మేర నష్ట వచ్చిందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు శనివారం జరిగిన ఘటనపై కోలార్​ జిల్లాలోని వేమగల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

సుమారు రూ.412.50 కోట్లు విలువైన కార్యాలయ సామగ్రి, మొబైల్​ ఫోన్లు, ఉత్పత్తి యంత్రాలు, వాటికి సంబంధించిన వస్తువులు ధ్వంసమైనట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్​ టీడీ ప్రశాంత్​ తెలిపారు. అలాగే.. రూ.10 కోట్లు విలువైన మౌలిక సదుపాయాలు, రూ.60 లక్షల విలువైన కార్లు, గోల్ఫ్​ కార్ట్స్​, స్మార్ట్​ఫోన్లు, రూ.1.5 కోట్ల ఇతర గాడ్జెట్స్​లను ధ్వంసం చేయటం, ఎత్తుకెళ్లటం వంటివి చేశారని చెప్పారు. తమ పరిశ్రమలో 5000 మంది కాంట్రాక్టు కార్మికులు, మరో 2000 మంది గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రశాంత్​.

" నరసాపుర పరిశ్రమలో కార్మికుల చర్య దిగ్భ్రాంతికి గురిచేసింది. మేము చట్టాన్ని అనుసరిస్తాం. దర్యాప్తు చేసే అధికారులకు సహకరిస్తాం. మా బృందం సభ్యుల భద్రత, రక్షణకే మా తొలి ప్రాధాన్యం."

- సుదీప్తో గుప్తా, విస్ట్రాన్​ ఇండియా ఎండీ.

ఈ ఘటన సంబంధించి ఇప్పటి వరకు 149 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.

పరిశ్రమలో విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించింది కర్ణాటక ప్రభుత్వం. సంస్థ అధికారుల భద్రతతో పాటు గొడవకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.

ఇదీ చూడండి: జీతాలు చెల్లించలేదని కార్మికుల విధ్వంసం

ABOUT THE AUTHOR

...view details