తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పళనిస్వామి 'పాంచ్ పటాకా' మోగించేనా? - edappadi etv bharat

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి బరిలో దిగుతున్నారు. గత నాలుగు ఎన్నికల నుంచి ఆయనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించారు ఎడప్పాడి ప్రజలు. ఐదోసారీ ప్రజలు ఆయన పక్షానే ఉంటారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులే అందుకు అండగా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

Will Tamil Nadu CM regain Edappadi?
సొంత నియోజకవర్గంలో పళనిస్వామి నిలిచేనా?

By

Published : Mar 29, 2021, 12:56 PM IST

పళనిస్వామి... జయలలిత తర్వాత తమిళనాడు పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రి. 'అమ్మ' మరణం అనంతరం అన్నాడీఎంకేను ముందుండి నడిపిస్తున్న నేత ఆయన. రానున్న ఎన్నికల్లో గెలిచి మరోమారు సీఎం పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తనను ఇప్పటికే నాలుగుసార్లు గెలిపించిన ఎడప్పాడి నియోజకవర్గం నుంచే ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. అక్కడ ఆయనకున్న సానుకూలతలు ఏంటి? గెలుపు ఖాయమా?

ఎన్నికల ప్రచారాల్లో పళని

'సామాజిక' బలం..

ఎడప్పాడి సామాజిక వర్గంలో వన్నియర్‌ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. వారి మద్దతు పళనిస్వామికే ఉంది. దీనికి తోడు చేసిన అభివృద్ధి పనులు, సీఎంగా ఉన్న గుర్తింపుతో.. ఎడప్పాడిలో పళనిస్వామి గెలుపు ఖాయమని.. అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడుకు రెండో వరి ధాన్యాగారంగా పేరొందిన ఎడప్పాడి నియోజకవర్గానికి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చేనేత, పవర్‌ లూమ్స్‌ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఎడప్పాడిలో అభ్యర్థుల గెలుపోటములను ఖాయం చేసే శక్తిగా.. వన్నియర్ సామాజిక వర్గం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ద్వితీయ స్థానానికి పరిమితమైన పీఎంకే.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోనే భాగస్వామిగా ఉండటం గమనార్హం. 1977 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 5 సార్లు, పీఎంకే 3 సార్లు గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండటం వల్ల పళనిస్వామికి భారీ మెజారిటీ ఖాయమని విశ్లేషకులు కూడా అంటున్నారు.

తమిళ సీఎం

ఇదీ చూడండి:-ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్​ అయ్యేనా?

గౌండర్‌ సామాజికవర్గానికి చెందిన పళనిస్వామి జయలలిత మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు.. గెలుపునకు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. నియోజకవర్గంలో.. సుమారు వంద ఎండిన చెరువులకు మేట్టూర్‌ ఆనకట్టలోని నీటిని మళ్లించడానికి.. మేచ్చేరి-నంగవళ్లి సహకార తాగునీటి ప్రాజెక్టును పళనిస్వామి అమలుచేశారు. ఎడప్పాడిలో నూతనంగా.. జిల్లా విద్యా కార్యాలయం, పలు ప్రాంతాల్లో.. కళాశాలలు, పాఠశాలలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో.. ముస్లింల కోసం ఈద్గా మైదానాన్ని నిర్మించారు.

పళనిస్వామి

డీఎంకే వ్యూహం..

ఎడప్పాడిలో పళనికి పోటీగా డీఎంకే నుంచి సంపత్‌కుమార్‌ బరిలో ఉన్నారు. 18 ఏళ్లుగా డీఎంకేలో ఉన్న ఆయన.. 2015 నుంచి సేలం పశ్చిమ జిల్లా ఉపకార్యదర్శిగా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 1971 తర్వాతి నుంచి.. ఎడప్పాడిలో డీఎంకే జెండా ఎగరలేదు. పళనిస్వామి విజయావకాశాలకు గండికొట్టడానికి.. డీఎంకే తనదైన ప్రయత్నాలను ముందు నుంచే చేపట్టింది. డీఎంకే నేతలు.. విస్తృతంగా ప్రచారం చేస్తూ.. పళని వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అయినా తనకున్న సానుకూలతలను మెట్లుగా మార్చుకుని శాసనసభ్యునిగా విజయం సాధిస్తాననే ధీమాలో ఉన్నారు పళనిస్వామి.

మరి ప్రజలు ఈసారి కూడా పళనిస్వామికి ఓటు వేస్తారా? లేక ఆయనకు షాక్​ ఇస్తారా? అన్న విషయం మే 2తో తేలుతుంది.

ఇదీ చూడండి:-తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details