తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 7:11 PM IST

ETV Bharat / bharat

'మమతపై దాడి'తో వేడెక్కిన బంగాల్​ రాజకీయం

మమతా బెనర్జీపై 'దాడి' నేపథ్యంలో బంగాల్​ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రస్తుత సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆసుపత్రి నుంచి వీడియో సందేశం అందించారు మమత. అవసరమైతే వీల్​చైర్​పైనే ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్​ చేశాయి భాజపా, కాంగ్రెస్​.

Mamatha Banerjee
బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 'దాడి' ఘటన.. ఆ రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ అధినేత్రిపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార తృణమూల్​ కాంగ్రెస్​ ఆరోపించగా... భాజపా, కాంగ్రెస్​, ఇతర పార్టీలు ఖండించాయి. ఈ తరుణంలో మమత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటి?

నిలకడగా ఆరోగ్యం..

మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోల్​కతాలోని ఆస్పత్రిలో ఆమె చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. "గాయమైన ఎడమ కాలులో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. రక్తంలో సోడియం స్థాయులు తగ్గాయి. ఎడమ కాలి చీలమండ, పాదంతో పాటు కుడి భుజం, మెడకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మమత ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పరిశీలించింది. రేడియోలాజీ నిర్వహించాలని నిర్ణయించింది" అని చెప్పారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమత

'అవసరమైతే వీల్​చైర్​పైనే ప్రచారం చేస్తా'

నందిగ్రామ్​లో తనపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. ఈ మేరకు ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపారు. ప్రజలకు అసౌకర్యం కలిగే ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని సూచించారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతానని, త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. అవసరమైతే వీల్​చైర్​పైనే ప్రచారం చేస్తానని పార్టీ నేతలకు భరోసా కల్పించారు.

ఆసుపత్రి నుంచి వీడియో మమతా వీడియో సందేశం

ఈసీ వద్దకు టీఎంసీ నేతలు

మమతా బెనర్జీపై దాడి గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ మేరకు శుక్రవారం దిల్లీలో ఈసీని కలవనున్నారు పార్టీ ఎంపీలు. ఇందుకోసం ఆరుగులు ఎంపీలు దిల్లీకి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే.. కోల్​కతాలో ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు పార్టీ నేతలు. ఆ తర్వాత ఈసీపై విమర్శలు గుప్పించారు. దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందుగా తెలిపినప్పటికీ ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. నందిగ్రామ్​లో హింసకు పాల్పడేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భాజపా.. గుండాలను దింపిందని, మమతపై దాడి కుట్రలో భాగమేనని ఆరోపించిచారు.

భాజపా, కాంగ్రెస్​ విమర్శలు..

నందిగ్రామ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన డ్రామానా, కాదా అన్నది తేలుతుందన్నారు. ఇంతకు ముందు కూడా ఈ తరహా డ్రామాలను బెంగాలీలు చూశారని చెప్పారు. ఇప్పుడు వాస్తవాలు తెలియాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

దాడి, కుట్ర, హత్యాయత్నం వంటి పేర్లతో సానుభూతి పొందాలని మమత భావిస్తున్నారని కాంగ్రెస్​ ​ నేత అధీర్​ రంజన్​ చౌదరి ఆరోపించారు. ఈ దాడి జరిగినప్పుడు తన వెంట పోలీసులు ఎవరూ లేరని చెప్పడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, సీసీటీవీ రికార్డులను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు.

పరామర్శించేందుకు భాజపా నేతలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతను పరామర్శించేందుకు భాజపా నేతలు తథాగథ్​ రాయ్​, శామిక్​ భట్టాచార్య.. ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రికి వెళ్లారు. కానీ, వైద్యాధికారుల సూచనలతో ఆమెను వారు కలుసుకోలేపోయారు.

మేనిఫెస్టో విడుదల వాయిదా..

మమతపై దాడి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది తృణమూల్​ కాంగ్రెస్​. కోల్​కతా కాళీఘాట్​లోని తన నివాసంలో మమతా బెనర్జీ గురువారం మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది.

కేసు నమోదు చేసిన పోలీసులు..

టీఎంసీ నేత షేక్​ సుఫియాన్​ ఫిర్యాదు మేరకు మమతా బెనర్జీపై దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్​ 341, 323 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పుర్బా మెదినాపుర్​ జిల్లాకు చెందిన ఓ సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. సంఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా మెజిస్ట్రేట్​ విభు గోయల్​, ఎస్పీ ప్రవీణ్​ ప్రకాశ్​, ఇతర అధికారులు సందర్శించారు. సీసీటీవీ కెమెరాల సమాచారం సేకరణతో పాటు సంఘటనా సమయంలో అక్కడే ఉన్నవారితో మాట్లాడినట్లు చెప్పారు.

సంఘటనా స్థలంలో జిల్లా జడ్జీ, ఎస్పీ, ఉన్నతాధికారులు

రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తల ఆందోళనలు

మమతా బెనర్జీపై దాడిని ఖండిస్తూ తృణమూల్​ కాంగ్రెస్​ కార్యక్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కోల్​కతా, ఉత్తర 24 పరగణాలు, హూగ్లీ, హౌరా, బిర్భుమ్​, దక్షిణ 24 పరగణాలు, జల్పాయ్​గుడి జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుట్రపూరితంగానే తమ నాయకురాలిపై దాడి చేశారని ఆరోపించారు.

బిరూలియా ప్రాంతంలో భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే.. కాసేపటికే పరిస్థితులు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు.

నందిగ్రామ్​లోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మమత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు ఆమె మద్దతుదారులు.

నల్ల జెండాలతో 'నిశ్శబ్ద' నిరసన..

బంగాల్​ ముఖ్యమంత్రి మమతపై దాడిని ఖండిస్తూ శుక్రవారం నల్ల జెండాలతో నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నల్ల జెండాలు, నోటికి నల్ల బ్యాండ్లు కట్టుకొని నిశ్శబ్ద నిరసనలు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:మమతకు గాయం: కుట్రా? నాటకమా?

ABOUT THE AUTHOR

...view details