Wife Sells Husband To Another Woman For Rs 5 Lakhs : ఓ తెలుగు సినిమాలో భర్తను.. రూ.కోటికి మరో మహిళకు విక్రయిస్తుంది హీరోయిన్. సరిగ్గా అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ జరిగింది. తన భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు అమ్మేసింది ఓ భార్య. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా మహిళలిద్దరూ కుదుర్చుకున్న రాజీ ఒప్పందం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే...
మండ్య సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. స్థానికంగా ఉండే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీన్ని అతని భార్య గుర్తించింది. ఈ విషయంపై భర్తను, సదరు మహిళను నిలదీసింది. అనంతరం ఆడవాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు ఆ వివాదం గ్రామ పంచాయితీకి చేరింది.
"నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి.. నీ భర్తను తీసుకువెళ్లు" అని పంచాయతీలో అతని భార్యకు తేల్చిచెప్పింది మహిళ. అయితే, ఈ ప్రతిపాదనకు అతడి భార్య నిరాకరించింది. అలాంటి భర్త తనకేమివద్దని, తనకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి అతడ్ని ఉంచేసుకోవాలని ఆ మహిళకు సూచించింది ఇల్లాలు. దీనికి ఇద్దరు మహిళలు అంగీకరించారు. ఒప్పుకున్న నగదును ఇచ్చేందుకు ఇల్లాలిని ఒక నెల గడువు అడిగింది మహిళ. అందుకు ఆ గృహిణి కూడా అంగీకరించింది. వీరిద్దరూ కుదుర్చుకున్న ఈ రాజీ ఒప్పందంతో పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు అవాక్కయ్యారు.