తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2021, 10:24 AM IST

ETV Bharat / bharat

5 అసెంబ్లీల ఎన్నికల్లో గెలుపు గుర్రాలేవో!

ప్రస్తుతం యావద్దేశం దృష్టి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైకి మళ్లింది. కేరళ, తమిళనాడు, బంగాల్, అసోం సహా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎవరు అధికారాన్ని చేపడతారా అని చర్చ ఊపందుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం పార్టీలు తమ తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈసీ ప్రకటన విడుదల చేసిన వేళ.. అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Election Story
5 అసెంబ్లీల ఎన్నికల్లో గెలుపు గుర్రాలేవో!

సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. పేరుకు నాలుగు రాష్ట్రాలు (బంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ), ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి)లో అసెంబ్లీ ఎన్నికలే అయినా యావద్దేశాన్ని ఆకర్షించే రాజకీయ మసాలా వీటిలో దాగుండటమే ఇందుకు కారణం! వీటిలో పుదుచ్చేరిని కాసింత పక్కన బెడితే... మిగిలిన నాలుగు... అత్యంత ఆసక్తి రేకెత్తించేవే! జయ, కరుణల మరణంతో మారిన రాజకీయ ముఖచిత్రాలు, ఏమాత్రం తగ్గని మమత బెనర్జీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ల అస్తిత్వ పోరాటాలు, అన్ని రాష్ట్రాల్లోనూ తమ జెండా ఎగరాలని కమలనాథుల దూకుడు నేపథ్యంలో తాజా ఎన్నికలు...దేశవ్యాప్త ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

  • ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఒక్కో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నింటా అధికారం కోసం ప్రయత్నించిన (బంగాల్‌, తమిళనాడు, కేరళల్లో పొత్తులతో కలసి) కాంగ్రెస్‌ పార్టీ ఒక్క పుదుచ్చేరిలో మాత్రమే అదీ డీఎంకే మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అసోం, కేరళల్లో అధికారం కోల్పోయింది.
  • 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్‌ తప్పించి... ఝార్ఖండ్‌, దిల్లీ, మహారాష్ట్రల్లో ఓడిపోయి, హరియాణాలో చావుతప్పి కన్నులొట్టబోయింది భాజపా!
  • కేరళ, బంగాల్, అసోంలలో కలిపి ముస్లిం ఓటర్లు 28-32 శాతం ఉంటారు.
  • మోదీ ప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన, పెట్రో ధరల మంట, కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

116 లోక్‌సభ సీట్లకు ప్రాతినిధ్యం వహించే ఈ ఐదు రాష్ట్రాల్లో పట్టు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా బంగాల్​లో తృణమూల్‌ కాంగ్రెస్‌, తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు, కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు ఇవి కఠిన పరీక్షలుగా నిలుస్తున్నాయి.

కామ్రేడ్ల ఆఖరి వికెట్‌ ఆగేనా?

బంగాల్​లో మిత్రపక్షాలుగా కలసి పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌... కేరళకొచ్చే సరికి బద్ధవైరులుగా మారటం రాజకీయ వైచిత్రి! 40 ఏళ్లుగా కేరళలో ఓసారి వామపక్షాల సారథ్యంలోని కూటమి (ఎల్‌డీఎఫ్‌) గెలిస్తే మరోసారి కాంగ్రెస్‌ సారథ్యంలోని (యూడీఎఫ్‌) కూటమి గెలుస్తోంది. మరి ఈసారి ఏమవుతుందనేది చూడాలి. గోల్డ్‌స్కాంలో ముఖ్యమంత్రి కార్యాలయంపైనే ఆరోపణలు రావటం అధికార కామ్రేడ్లకు మచ్చ! కానీ కొవిడ్‌, వరదల విషయంలో ప్రభుత్వం బాగానే స్పందించిందనుకుంటున్న నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది చూడాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దేశంలో కమ్యూనిస్టులు అధికారానికి పూర్తిగా దూరమైనట్లే! ఎందుకంటే ప్రస్తుతం ఇదొక్కటే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రం! కేరళలోనూ భాజపా దూసుకుపోవాలని చూస్తున్నా సందు దొరకటం లేదు. మెట్రోమ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతోంది. ఆ ఎత్తుగడ అధికారాన్ని అందించేంతగా మాత్రం ఉపయోగపడకపోవచ్చు.

ఆ ఆందోళన ప్రభావమెంత?

అసోంలో భాజపా నేరుగా కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో ఉంది. కాంగ్రెస్‌ను ఓడించి 2016లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా ఆ గెలుపు యాదృచ్ఛికం కాదని నిరూపించుకునేందుకు పట్టుదలతో ఉంది. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు రాష్ట్రంలో ఆందోళనలకు దారి తీసింది. బంగ్లావలస దారులనే కాకుండా అసోం స్థానికులకు కూడా దీనితో ముప్పుందని ఆందోళన రేగటంతో ప్రభుత్వం దీన్ని ఆపేసింది. దీనికి తోడు మైక్రోఫైనాన్స్‌ రుణాలు గ్రామీణ అసోంలో ఆత్మహత్యలకు కారణమవుతూ సామాజిక సమస్యగా మారాయి. ఇవన్నీ భాజపా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలే. కానీ వాటిని వాడుకొనే పరిస్థితిలో రాష్ట్ర కాంగ్రెస్‌ లేకపోవటం కమలనాథులకు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో పడుతూలేచే ప్రయత్నం చేస్తోంది.

ఆ ఇద్దరు లేని చోట....

తమిళనాడులో రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలితలు లేని తొలి రాజకీయ సమరమిది! కరుణానిధి వారసుడిగా స్టాలిన్‌ డీఎంకేను నడుపుతున్నా... అన్నాడీఎంకేకు వారసులు లేరు. జయలలిత మరణానంతరం అంతర్గత కుమ్ములాటలతో అన్నాడీఎంకే బలహీనమైంది. దీనికి తోడు జైలు నుంచి జయలలిత నెచ్చెలి శశికళ విడుదలై రావటంతో అన్నాడీఎంకేలో అంతర్గత పోరు మరింత పెరిగింది. కేసులో శిక్ష కారణంగా శశికళ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేరు. పార్టీకి లాభం చేస్తారా? నష్టం కలిగిస్తారా అనేది ఆసక్తికరం! మరోవైపు ఇవన్నీ తెలిసి కూడా జయలలిత లేని అన్నాడీఎంకేతోనే ఈసారీ పొత్తు పెట్టుకోవాలని భాజపా నిర్ణయించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 3.6% ఓట్లు సంపాదించినా భాజపాకు సీట్లేమీ రాలేదు. సినీస్టార్‌ రజనీకాంత్‌పై కమలనాథులు ఆశలు పెట్టుకున్నా అవేవీ ఫలించలేదు. రజనీకాంత్‌ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లటం... కమలహాసన్‌ కొత్త పార్టీతో తమిళనాట రాజకీయం గుంభనంగా ఉంది. స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే వీటన్నింటినీ ఎంతమేరకు ఉపయోగించుకుంటుందనేది చూడాలి.

పుదుచ్చేరి

పుదుచ్చేరిలో తమకంతగా బలం లేకున్నా... కాంగ్రెస్‌లోని అంతర్గత గొడవలకు కేంద్రంలో తనకున్న అధికారం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సాయం కలసి భాజపా రాజకీయం చేయగలిగింది. ఎన్నికల తర్వాత కూడా భాజపా ఇలాగే తన 'పాత్ర' పోషించవచ్చు!

తూర్పున కమలం ఉదయించాలని....

అందరి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది బంగాల్​ పైనే! ఈశాన్య భారతంలో ఇప్పటికే బలమైన ముద్రవేసిన కమలనాథులు తాజాగా 'తూర్పు'న ఉదయించటానికి ఉబలాటపడుతున్నారు. అందుకే బంగాల్​లో పట్టు కోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పదేళ్ల పాలనకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి సకలశక్తులూ ఒడ్డుతున్నారు. 2011లో కేవలం 4శాతం ఓట్లతో ఆరంభించి... 2016 అసెంబ్లీ ఎన్నికల నాటికి 10 శాతానికి పెంచుకున్నారు. 2019లో 42 లోక్‌సభ సీట్లకుగాను 18 గెల్చుకున్నప్పటి నుంచి భాజపా దూకుడు మరింత పెరిగింది. రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన పార్టీలైన కమ్యూనిస్టు, కాంగ్రెస్‌లు నామమాత్రమైపోయాయి. ఈ రెండు పార్టీలు పొత్తులో బరిలోకి దిగుతున్నా... రాష్ట్రంలో ఇప్పుడు పోటీ తృణమూల్‌, భాజపా మధ్యే! మమతా బెనర్జీపై అవినీతి ఆరోపణలు, మైనార్టీలకు వంతపాడుతున్నారంటూ ఆరోపిస్తూ భాజపా ఎదురుదాడి చేస్తోంది. భారీస్థాయిలో తృణమూల్‌ నేతలు భాజపాలో చేరుతున్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ నుంచి బంకించంద్ర ఛటర్జీ దాకా ప్రతి ఒక్కరినీ తన ఎదుగుదలలో వినియోగించుకుంటోంది. మరోవైపు మమత కూడా ఏమాత్రం తగ్గకుండా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ, భాజపా మతతత్వ పార్టీ అని ఆరోపిస్తూ, బంగాలీ బిడ్డనంటూ అస్తిత్వ నినాదంతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగాల్​లో ముస్లింల జనాభా 27శాతంపైగానే ఉంది. వీరంతా తమకే ఓటు వేస్తారనేది మమత ధీమా. అదే భాజపాకు ఆయుధమవుతోంది కూడా! ఉద్వేగాలకు బంగాలీలెలా స్పందిస్తారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details