లక్షద్వీప్లో సినీ దర్శకురాలు ఐషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్.. కేంద్రం పంపిన జీవాయుధమని, కొవిడ్ను కట్టడి చేయడంలో ఆయన విఫలమయ్యారంటూ టీవీ చర్చలో భాగంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్కడి భాజపా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఈ కేసు నమోదైంది.
గత ఏడాది మొత్తం ఒక్క కరోనా కేసు సైతం నమోదుకాని లక్షద్వీప్లో ఇప్పుడు బయటివారి రాకపోకలు పెరిగి దాదాపు 7,000 కేసులు నమోదయ్యాయి. కేవలం 65 వేల జనాభాగల ఈ దీవుల్లో కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం దేశంలోనే అత్యధికం. ఈ క్రమంలో ఐషా.. టీవీ చర్చలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. 'లక్షద్వీప్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రోజుకు సుమారు 100 మందికి వైరస్ సోకుతోంది. ఇక్కడ కేంద్రం జీవాయుధాన్ని మోహరించిందని స్పష్టంగా చెప్పగలను' అంటూ గతవారం పటేల్ వైఖరిపై మండిపడ్డారు.