ఉద్యమం నుంచి అవతరించి అసోం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిన 'అసోం గణ పరిషత్ (ఏజీపీ)' తాజా ఎన్నికల్లో అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. రాష్ట్రంపై క్రమంగా కోల్పోతున్న పట్టును.. తిరిగి చేజిక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి ఏజీపీ లక్ష్యం నెరవేరుతుందా? రాష్ట్రంలో ఆ పార్టీ పునర్ వైభవాన్ని సాధిస్తుందా?
అవతరణ..
అసోంలోకి విదేశీయుల వలసలను నిరసిస్తూ ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఆరేళ్లపాటు పెద్దయెత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ ఉద్యమ ఫలితంగా 1985లో ఏజీపీ అవతరించింది. దాని స్థాపకుడు ప్రఫుల్లకుమార్ మహంత, ఎన్నికల గుర్తు ఏనుగు. రాష్ట్రంలో ఒకప్పుడు అదికారాన్ని సైతం దక్కించుకొని ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఆ పార్టీ.. కొన్నేళ్లుగా సరైన ఫలితాలు దక్కక ఇబ్బంది పడుతోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఇప్పుడు ఏజీపీ ఎన్నికల బరిలో దిగింది. ఒకప్పుడు అసోంలో ఏజీపీకి భాజపా జూనియర్ భాగస్వామి. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. పొత్తులో భాగంగా ప్రస్తుతం కేవలం 23 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో విజయం సాధించాలన్నా ఏజీపీ తీవ్రంగా చెమటోడ్చక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకు ప్రధాన కారణాలివీ..
5 సిట్టింగ్ స్థానాలు గల్లంతు
పంపకాల్లో భాగంగా ఐదు సిట్టింగ్ స్థానాలను భాజపాకు ఏజీపీ కేటాయించాల్సి వచ్చింది. అవి.. బర్హంపుర్, కమలాపూర్, లఖీంపూర్, నాహర్ కటియా, పతచర్కుచీ, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైన సరూపాథర్ సీటునూ కమలదళానికే ప్రస్తుతం సమర్పించుకోవాల్సి వచ్చింది. పార్టీకి మంచి పట్టున్న ఈ స్థానాలను కోల్పోవడం ప్రతికూల పరిణామం. బర్హంపుర్లో 1991 నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత ఆరుసార్లు గెల్చుకోవడం గమనార్హం.