నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నిర్వహించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద పెద్దసంఖ్యలో దిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ట్రాక్టర్లతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు కొంత మంది రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఏడు నెలలు పూర్తైన సందర్భంగా సాగు చట్టాలను నిరసిస్తూ.. 'సేవ్ అగ్రికల్చర్ సేవ్ డెమొక్రసీ' పేరుతో అన్ని రాష్ట్రాల గవర్నర్లకు అన్నదాతలు వినతిపత్రాలు సమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
పంచకులాలో ఉద్రిక్తత..
గవర్నర్కు మెమోరాండం సమర్పించేందుకు రైతులు భారీగా తరలి వెళ్లడం వల్ల పంచకులా-చండీగఢ్ సరిహద్దు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గవర్నరే స్వయంగా అన్నదాతల వద్దకు వచ్చి మెమోరాండం తీసుకుంటారని తొలుత అధికారులు చెప్పారు. అయినా రైతులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమి లేక పోలీసులు బారీకేడ్లను తొలగించి రైతులను ముందుకు పంపారు. దీంతో వేలాది మంది అన్నదాతలు రాజ్భవన్వైపు ర్యాలీగా వెళ్లారు.
ఉద్యమం ఆగదు..
కేంద్రం సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని గాజీపుర్ సరిహద్దులో రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్ తేల్చిచెప్పారు. దిల్లీ సరిహద్దులో నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల్లో కొందరు ఇంటికి వెళ్తే వారి స్థానంలో కొత్త వారు వస్తారని, ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తూ.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. దిల్లీ సరిహద్దుకు వచ్చిన రైతులు.. దిల్లీలోకి వెళ్లరని రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. ఒకవేళ దిల్లీ వెళ్లాలని ప్రణాళిక రూపొందిస్తే 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తామన్నారు.