Vivekananda Reddy murder case latest news: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఈరోజు ఉదయం పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి ఉస్మానియా వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల్లో భాస్కర్ రెడ్డికి స్వల్పంగా రక్తపోటు పెరగినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రి నుంచి సీబీఐ జడ్జి ముందు హాజరుపరచగా.. భాస్కర్ రెడ్డికి 14 రోజులు (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో వేగం పెంచిన సీబీఐ.. ముందుగా హైదరాబాద్లోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లింజి. ఇంట్లో అవినాష్ రెడ్డి లేకపోవడంతో కడప జిల్లా పులివెందులలోని భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి నివాసాలకు 2 వాహనాల్లో సీబీఐ బృందం వెళ్లింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఉదయం 6 గంటలకు ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ మెమోను.. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి సీబీఐ అధికారులు అందజేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని 120-బి రెడ్ విత్ 302, 201 ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు మెమోలో పేర్కొన్నారు.