తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాళ్ల నుంచి కారే నీరు తాగాము- మరమరాలు తిని బతికాము'- సొరంగంలో చిక్కుకున్న కూలీలు - tunnel collapse latest news

Uttarkashi Tunnel Rescue Operation Success : 17 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు కార్మికులు భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్​లో భాగమయిన ప్రతి ఒక్కరిని అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Uttarakhand Tunnel Incident Latest News
Uttarkashi Tunnel Rescue Operation Success

By PTI

Published : Nov 29, 2023, 3:21 PM IST

Updated : Nov 29, 2023, 3:35 PM IST

Uttarkashi Tunnel Rescue Operation Success :'రాళ్ల నుంచి కారిన నీరు తాగాను.. అందుబాటులో ఉన్న మరమరాలు తిని ఇన్ని రోజులు బతికాను'.. గత 17 రోజులుగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఒక కూలీ అన్న మాటలివి. టన్నెల్​ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఈ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు ఝార్ఖండ్​కు చెందిన అనిల్ బేడియా అనే కార్మికుడు. సొరంగం లోపలే తామందరం ప్రాణాలు కోల్పోతామని అనుకున్నామని.. మొదటి రెండు రోజులు తాము బతికి బయటకు వస్తామన్న ఆశలు కూడా లేవని అనిల్ వివరించారు. అయితే తమను సురక్షితంగా బయటకు చేర్చడంలో చొరవ చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు.

"ఈ ఘటనను మేమందరము ఓ పీడకలలా భావిస్తున్నాము. దాహార్తిని తీర్చుకోవడానికి సొరంగంలో ఉన్న రాళ్ల మధ్యలో నుంచి కారుతున్న నీటిని ఒడిసిపట్టుకుని తాగాము. మొదటి 10 రోజులైతే మరమరాలు తిని బతికాము. ఆ తర్వాత అధికారులు అందించిన పండ్లు, నీళ్లు సహా ఇతర ఆహార పదార్థాలతో మేము బలమైన తిండి తినగలిగాము. దాదాపు 70 గంటల తర్వాత అధికారులు మమ్మల్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమవ్వడం వల్ల మేము బతుకుతాం అనే ఆశలు మొదలైయ్యాయి."
- అనిల్ బేడియా, సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుడు

ఆనందంతో వీల్​ఛైర్​లోనే..
టన్నెల్​లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్లో 15 మంది ఝార్ఖండ్​కు చెందిన వారే. క్షేమంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం తమవాళ్లు (కూలీలు) ప్రాణాలతో తిరిగి రావడం వల్ల వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న రాజేంద్ర అనే కూలీ కూడా ప్రాణాలతో బయటకు రావడం వల్ల.. పక్షవాతంతో బాధపడుతున్న అతడి 55 ఏళ్ల తండ్రి వీల్​ఛైర్​లోనే సంబరాలు చేసుకున్నారు.

కార్మికుల్లో ఇద్దరు ఉత్తరాఖండ్‌, ఐదుగురు బిహార్‌, ముగ్గురు బంగాల్​, ఎనిమిది మంది ఉత్తర్​ ప్రదేశ్‌, ఐదుగురు ఒడిశా, ఇద్దరు అసోం, ఒకరు హిమాచల్​ ప్రదేశ్​కు చెందినవారని అధికారులు తెలిపారు. ఇక కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకువచ్చిన నేపథ్యంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బాణాసంచా కాల్చారు. సొరంగం బయట కొందరు 'హర హర మహాదేవ్', 'భారత్ మాతా కీ జై', 'మోదీ, ధామీ జిందాబాద్​' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులకు పూల దండలు వేసి స్వాగతం పలికారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి వీకే సింగ్​.

ప్రత్యేక హెలికాఫ్టర్​లో..
కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అనంతరం వారందరినీ ప్రత్యేక అంబులెన్స్​లలో చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో విశ్రాంతి తీసుకున్నారు. అంతకుముందు సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరందరూ తిరిగి స్వస్థలాలకు వెళ్లే ముందు తదుపరి వైద్య చికిత్సల కోసం రిషికేశ్​లోని ఎయిమ్స్​ ఆస్పత్రికి ప్రత్యేక హెలికాఫ్టర్​లో తరలిస్తామని ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్​ హెల్త్​ నోడల్​ అధికారి బీమ్లేష్​ జోషీ తెలిపారు. ఇందులో భాగంగానే భారత వైమానిక దళానికి చెందిన చినూక్​ హెలికాఫ్టర్​లో వీరిని బుధవారం మధ్యాహ్నం ఎయిమ్స్​కు తరలించారు.

"సొరంగంలో చిక్కుకున్న నాటి నుంచి మేమంతా సురక్షితంగా బయటకు వస్తామనే ఆశ నాకుంది. అధికారులు అందించిన ఆహార పదార్థాలు తిని అందరం క్షేమంగా ఉన్నాము. మమ్మల్ని రక్షించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు"
-విశాల్, సొరంగం నుంచి బయటపడ్డ కూలీ

'అందరికీ థ్యాంక్స్​..'
ఈ 17 రోజులు సొరంగం లోపల యోగా, మార్నింగ్​ వాక్​ కూడా చేశామని.. అందుకే ఇంత ఉత్సాహంగా ఉన్నామని టన్నెల్​ నుంచి బయటకు వచ్చిన ఓ కార్మికుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​లో తెలిపారు. ఈ నేపథ్యంలో కూలీలు యోగక్షేమాలు తెలుసుకున్నారు మోదీ. వీరందరినీ ప్రాణాలతో రక్షించడంలో రాత్రింబవళ్లు కష్టపడ్డ రెస్క్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే కార్మికులు చికిత్స పొందిన తర్వాత వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ అన్ని ఏర్పాట్లు చేస్తారని మోదీ కార్మికులతో ఫోన్​లో చెప్పారు.

వారిని ప్రకృతే కాపాడింది : డిక్స్​
మరోవైపు ఆపరేషన్​ సక్సెస్​పై స్పందించిన డిక్స్.. ప్రకృతే వారిని కాపాడిందని పేర్కొన్నారు. తనకు ఇది ఒక పురాతన కథ లాంటిదని.. పర్వతమే ప్రతిదీ నియంత్రిస్తోందన్నారు. నలభై ఒక్క మంది కార్మికులను పర్వతం.. తల్లిలా సంరక్షించిందన్నారు. కార్మికులకు ఎటువంటి గాయాలు, ఏ హాని జరగలేదని.. వారు ఎప్పుడు ఎలా బయటకి రావాలో కూడా పర్వతమాతకు తెలుసని ఆర్నాల్డ్ డిక్స్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత టన్నెల్​ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన బాబా బోఖ్‌నాగ్ దేవతా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు డిక్స్​.

అద్భుతమైన విజయం : ఆస్ట్రేలియా ప్రధాని
టన్నెల్​ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అధికారులను అభినందించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్​. అంతేకాకుండా తమ దేశం నుంచి భారత్​కు వచ్చిన సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్‌ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్​లో భాగమయినందుకు గర్వంగా ఉందంటూ ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. మరోవైపు సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కృషి చేసిన సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్‌ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కొనియాడుతున్నారు.

'వారికి రూ.లక్ష, వీరికి రూ.50 వేలు..'
సొరంగంలో చిక్కుకుని బయటకు వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆయన సూచనల కారణంగానే ఆపరేషన్​ విజయవంతమైందని పేర్కొన్నారు.

"మొదట బాబా బోఖ్‌నాగ్ దేవతకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నేను కార్మికులందరినీ కలిశాను. వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించాము. ఆరోగ్యపరంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవు. తదుపరి వైద్య పరీక్షల కోసం రిషికేశ్​లోని ఎయిమ్స్​కు పంపాము. చెప్పినట్లుగా ప్రతి కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తాము. అంతేకాకుండా సొరంగం లోపల తవ్వకాలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ రూ.50,000 నగదు బహుమతి అందిస్తాము."
- పుష్కర్​ సింగ్​ ధామీ, ఉత్తరాఖండ్​ సీఎం

నవంబర్​ 12న ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీ జిల్లాలోని చార్​ధామ్​ సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర ఏజెన్సీలూ గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్​ను చేపట్టాయి. చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రతి ఒక్కరి సహకారంతో మంగళవారం సాయంత్రం కూలీలను ప్రాణాలతో బయటకు తేగలిగారు అధికారులు.

సేఫ్​గా 41 మంది కూలీలు బయటకు- 17 రోజుల రెస్క్యూ ఆపరేషన్​ సాగిందిలా!

ఆపరేషన్ సక్సెస్​- సేఫ్​గా బయటకొచ్చిన 41 మంది కూలీలు, 17 రోజుల నిరీక్షణకు తెర

Last Updated : Nov 29, 2023, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details