తెలంగాణ

telangana

ఆగర్ యంత్రం ధ్వంసం- రంగంలోకి హైదరాబాద్ ప్లాస్మా కటర్- క్రిస్మస్ వరకు కూలీలు లోపలే!

By PTI

Published : Nov 25, 2023, 4:15 PM IST

Uttarakhand Tunnel Update : ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం ధ్వంసమైంది. దీంతో తదుపరి కార్యాచరణపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. మరి ప్రస్తుతం కూలీల పరిస్థితి ఎలా ఉంది? వారు బయటకు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది? నిపుణులు ఏమంటున్నారు?

Uttarakhand Tunnel Update
Uttarakhand Tunnel Update

Uttarakhand Tunnel Update :ఉత్తరాఖండ్​ సిల్​క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు బయటకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న ఆగర్ యంత్రం ధ్వంసమైంది. ఆగర్‌ యంత్రం ఇక సహాయక ( Uttarakhand Tunnel Rescue Operation) చర్యలకు పనికిరాదని నిపుణులు స్పష్టం చేశారు. అది రిపేర్ చేయలేని స్థాయిలో ధ్వంసమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటి? కూలీలను బయటకు తీసుకురావడానికి ఉన్న మార్గాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ప్రస్తుతం సహాయక చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి?
అమెరికా నుంచి తెప్పించిన ( Tunnel Rescue Uttarakhand ) ఆగర్ యంత్రంతో శిథిలాలకు సమాంతరంగా డ్రిల్లింగ్ చేశారు. అయితే, ఆగర్ యంత్రం ఇప్పుడు పనిచేయడం లేదు. సొరంగంలో ఆగర్ యంత్రం బ్లేడ్లు విరిగిపోయాయి. శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లను తీయడానికి ప్లాస్మా కటర్​ అవసరమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. దాన్ని హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్​కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

ఆగర్ యంత్రం ఎందుకు ఆగిపోయింది?
ఆగర్ యంత్రం చాలా వరకు సమర్థంగా పని చేసినప్పటికీ.. శిథిలాల్లో కొన్నిచోట్ల దానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నాలుగుసార్లు ఆగర్ యంత్రం ఆగిపోయిందని అంతర్జాతీయ సొరంగ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. "ఈ కొండప్రాంతం చాలా కఠిన సవాళ్లు విసురుతోంది. ఆగర్ యంత్రం నాలుగు సార్లు దెబ్బతింది. ఇక ఆగర్ పని చేయదు. అది ధ్వంసమైంది. దాన్ని సహాయక చర్యలకు వినియోగించడం కుదరదు. రిపేర్ చేయలేని రీతిలో అది పాడైంది. కొత్త ఆగర్​ను రంగంలోకి దించే ప్రస్తావనే లేదు" అని డిక్స్ వివరించారు.

కూలీలను తీసేందుకు ఇప్పుడు ఏం చేస్తారు?
ఆగర్ యంత్రం విఫలమైన నేపథ్యంలో మ్యాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యామ్నాయాల మార్గాలనూ అన్వేషిస్తున్నారు. సొరంగంపై నుంచి నిలువునా డ్రిల్లింగ్ చేపట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు వర్టికల్‌ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని కొండపైకి చేర్చాలని సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ఓ) అధికారులు తమ సిబ్బందిని ఆదేశించారు.

సిద్ధంగా ఉన్న వర్టికల్ డ్రిల్లింగ్ యంత్రం

సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్(ఎస్​జేవీఎన్) బృందం కూడా వర్టికల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం భారీ యంత్రాలు, బోరింగ్ మెషీన్​ను అమెరికా, ముంబయి, గాజియాబాద్​ నుంచి ఓఎన్​జీసీ తెప్పించింది. 'మా టీమ్ ఆ ప్రాంతంలో సర్వే పూర్తి చేసింది. 5, 6 రోజుల్లో వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి చేస్తామని ప్రతిపాదనలు పంపించాం. తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం' అని సట్లెజ్ జల్ విద్యుద్ నిగమ్ వెల్లడించింది.

వర్టికల్ డ్రిల్లింగ్ యంత్రపరికరాలు

వేగంగా కూలీలను బయటకు తీసే మార్గం లేదా?
అన్ని రకాల మార్గాలను తాము అన్వేషిస్తున్నామని ఆర్నాల్డ్ డిక్స్ చెప్పారు. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయన్నారు. "బెస్ట్ ఆప్షన్ అనేది లేదు. చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, ఈ కొండ అస్థిరంగా ఉంది. ఇప్పటికే ఓసారి సొరంగం కూలింది. మళ్లీ కూలే ప్రమాదం లేదని అనుకోవద్దు. భారీగా కొండచరియలు విరిగిపడితే పరిస్థితి మరింత జఠిలం అవుతుంది. మేం అన్ని పనులు ఒకేసారి ఎందుకు చేయడం లేదని మీరు అనుకోవచ్చు. కానీ, మేం జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నాం. మా తొలి ప్రాధాన్యం 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకురావడం. ప్రభుత్వం కూలీల ప్రాణాలు, సహాయక సిబ్బంది ప్రాణాలకు ప్రాధాన్యం ఇస్తోంది" అని ఆర్నాల్డ్ డిక్స్ వెల్లడించారు.

ప్రస్తుతం కూలీల పరిస్థితి ఎలా ఉంది?
సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల్లో ఎవరికీ గాయాలు కాలేదని ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నారు. వారికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నట్లు చెప్పారు.

కూలీలు ఎప్పటికి బయటకు రావొచ్చు?
"కూలీలు క్రిస్మస్​కల్లా బయటకు వస్తారు. ఈ విషయం నేను ముందు నుంచే చెబుతున్నా. అది చాలా సుదీర్ఘ సమయం అని నాకు తెలుసు. కానీ కూలీలు సురక్షితంగా ఉన్నారు. మనం తొందరపడితే మరో సమస్య సృష్టించినట్లు అవుతుంది" అని ఆర్నాల్డ్ డిక్స్ వివరించారు. సహాయక చర్యలను పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ.. త్వరలోనే కూలీలను బయటకు తీసుకొస్తామని చెప్పారు.

ఉత్తరకాశీ జిల్లాలోని బ్రహ్మకల్‌-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్​క్యారా, దండలగావ్ మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్‌లో కొంతమేర కూలిపోయింది. నవంబర్​ 12న ఈ ఘటన జరిగింది. సొరంగం కూలిన సమయంలో లోపల 41 మంది కూలీలు చిక్కుకున్నారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో.. 150 మీటర్ల పొడవున కూలినట్లు అధికారులు వివరించారు. చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది.

సొరంగంలోకి DRDO రోబోలు- వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత!

కూలీలకు వేడివేడి కిచిడీ- బాటిళ్లలో నింపి లోపలకు- సొరంగంలోని కార్మికుల లైవ్​ వీడియో

ABOUT THE AUTHOR

...view details