Uttarakashi Tunnel Incident Live Video :ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల ఉన్నవారి క్షేమసమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తున్నాయి. గత 11 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల పైప్ను లోపలకు పంపించారు. దీని ద్వారా పంపిన ఓ ఎండోస్కోపీ కెమెరాలో కూలీలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో వారంతా సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన అధికారిక ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కాగా, టన్నెల్ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై విచారణ జరుపుతామని సీఎం ధామి హామీ ఇచ్చారు.
ఫ్యామిలీతో మాట్లాడిన కూలీలు!
కార్మికులకు సంబంధించిన దృశ్యాలను తొలిసారిగా తీసుకోవడమే కాకుండా వారితో వీడియో ద్వారా ముఖాముఖి మాట్లాడడంలో సహాయక సిబ్బంది విజయం సాధించారు. కూలీలను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలాగే కూలీలకు కావాల్సిన ఆహారం, మంచినీళ్లను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమైన సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
'మా పూర్తి సహకారం ఉంటుంది..'
చార్ధామ్ మార్గంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్ఓ భద్రతా దళాలు సహా అంతర్జాతీయ నిపుణులు భాగస్వాములయ్యారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి తెలిపారు. అలాగే కేంద్ర సాంకేతిక ఏజెన్సీలు కూడా ఈ ప్రక్రియలో ముందున్నాయని.. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం కూడా అందిస్తోందని సీఎం చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. కూలీలతో మాట్లాడేందుకు కావాల్సిన మొబైళ్లు, ఛార్జర్లు, వాకీ టాకీలను కూడా అధికారులు సమకూర్చామని తెలిపారు. తద్వారా సొరంగం లోపల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న కూలీలందరూ క్షేమంగానే ఉన్నారని.. త్వరలోనే వారంతా బయటకు వస్తారనే అశాభావం తమకుందని పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ సైతం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
"సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ప్రత్యేక విమానాల ద్వారా కావాల్సిన పరికరాలు, సామగ్రిని కూడా తెప్పిస్తున్నాము. "
- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి