దిల్లీకి మెడికల్ ఆక్సిజన్ను అత్యవసరంగా సరఫరా చేయాలని కేంద్రాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పలు ఆసుపత్రుల్లో కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రికి కూడా కేజ్రీవాల్ లేఖ రాశారు.
"దిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో మరికొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. దిల్లీకి ఆక్సిజన్ను సరఫరా చేయాలని నేను కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాను."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
దిల్లీలో ఆక్సిజన్ వాడకాన్ని పరిశీలించేందుకుగాను 24 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని దిల్లీ ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసింది.
'పట్టించుకోవట్లేదు'
దిల్లీలో ఆక్సిజన్ నిల్వలు కేవలం 8 నుంచి 12 గంటలకు మాత్రమే సరిపడా అందుబాటులో ఉన్నాయని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. తాము వారం రోజులుగా దిల్లీకి సరఫరా చేసే ఆక్సిజన్ కోటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.