సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత తిథి ప్రకారం పదిరోజులకో, పదమూడురోజులకో వారికి పెద్దకర్మను నిర్వహిస్తుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరణించిన వ్యక్తి సంతానం జరిపించాల్సి ఉంటుంది. అయితే ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడు మాత్రం బతికుండగానే తన పెద్దకర్మ వేడుకను తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన సంతానం దీనిని జరిపిస్తారో లేదో అన్న సందేహంతో తనంతట తానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. అంతేగాక ఇందుకోసం ప్రత్యేకంగా భోజనాలు వండించి చక్కటి విందును కూడా ఏర్పాటు చేశాడు. 300 మందికిపైగా గ్రామస్థులు ఆ వృద్ధుడి పెద్దకర్మకు హాజరై భోజనాలు చేశారు. వృద్ధుడు చేసిన ఈ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
3 ఏళ్ల కిందటే సమాధి కూడా..
జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన 59 ఏళ్ల జఠాశంకర్ తాను బతికుండగానే ఎవరూ ఊహించని విధంగా ఈ పెద్దకర్మను నిర్వహించుకున్నాడు. ఈ వృద్ధుడు మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ సమాధిని కూడా నిర్మించుకున్నాడట. అంతేగాక చనిపోయాక తనను అదే సమాధిలో పాతిపెట్టమని కుటుంబ సభ్యులను కోరాడట. అయితే కొద్ది వారాల క్రితమే తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడట. ఈ కార్యక్రమం అనంతరం తన పెద్దకర్మ కార్యక్రమానికి రావాల్సిందిగా గ్రామస్థులందరినీ ఆహ్వానించాడు. కాగా, గురువారం రాత్రి జఠాశంకర్ తన పెద్దకర్మ పూర్తి చేశాడు. ఈ కార్యానికి శంకర్ బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అతడు ఆహ్వానించిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాజరయ్యారు. అతడు ఏర్పాటు చేసిన విందును ఆరగించారు.