UP elections 2022: దిల్లీ పీఠానికి దగ్గరిదారిగా భావించే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని గుప్పిట పట్టుకుంటే కేంద్రంలో పెత్తనం చెలాయించడం కష్టమేమీ కాదు. రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలిసిందే. అందుకే ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాయి. దేశ రాజకీయాల్లో ఉన్నత దశను అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇందుకు అతీతమేం కాదు. అందుకే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అఖండ మెజార్టీతో 2017 ఎన్నికలు గెలిచి రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లు పాలించిన కమలం పార్టీ.. మరోసారి అధికారంలోకి వచ్చి.. సార్వత్రిక ఎన్నికలకు ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకోవాలని భావిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రంగంలోకి దిగి.. ఎన్నికల్లో భాజపాను ముందుండి నడిపిస్తున్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.
UP Polls 2022 BJP
ఇక, క్షేత్రస్థాయిలోనూ కమలం పార్టీ వ్యూహాత్మకంగా దూసుకెళ్తోంది. పక్కా లెక్కలతో ముందుకెళ్తోంది. సామాజిక వర్గాలను, వారికి సమాజంలో ఉన్న ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకొని.. తమ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రాహ్మణ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సంప్రదాయంగా భాజపా ఓటు బ్యాంకుగా భావించే వీరిని మరింత ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టున్న బ్రాహ్మణ సంఘాలను ఎంపిక చేసి.. ఆయా ప్రతినిధులను కలిసేందుకు ప్రణాళికలు రచించింది భాజపా. 25 రోజుల్లో ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి.. తమకు అండగా ఉండాలని కోరనుంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు డిసెంబర్ 26న నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా నేతృత్వం వహిస్తున్నారు. మహేశ్ శర్మ, అభిజత్ మిశ్ర, రామ్ భాయ్ మొరాకియాలు సభ్యులుగా ఉంటారు.
Brahmin votes in UP
BJP Brahmin program in UP
భాజపా అధిష్ఠానం మార్గనిర్దేశం ప్రకారం ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించింది. ఉత్తర్ప్రదేశ్ రాజధాని అయిన లఖ్నవూలో తొలి సమావేశం ఏర్పాటు చేసింది. జనవరి 4న కమిటీ మరోసారి భేటీ కానుంది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం భాజపా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టే పనులను సంఘాల ప్రతినిధులకు వివరించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. 25 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్ఠానం వీరిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
BJP meeting Brahmin community