తెలంగాణ

telangana

కర్ణాటక కొత్త సీఎం ఎవరో తేల్చే బాధ్యత కిషన్​ రెడ్డిదే!

By

Published : Jul 27, 2021, 12:54 PM IST

యడియూరప్ప రాజీనామా నేపథ్యంలో తదుపరి సీఎం ఎంపికపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు జి. కిషన్​ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్​ను రంగంలోకి దింపింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరులో భాజపా ఎమ్మెల్యేలతో వీరు సమావేశం కానున్నారు.

Karnataka politics
కర్ణాటక సీఎం కోసం వేట

యడియూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి కోసం 'రాజకీయ వేట' మొదలైంది. ఇప్పటికే అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు జి. కిషన్​ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్​ను రంగంలోకి దింపింది. వీరు బెంగళూరులో మంగళవారం సాయంత్రం 5 గంటలకు భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

సీఎం రేసులో ప్రముఖులు

యడియూరప్ప వంటి శక్తిమంతమైన నేత స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత సులువు కాదని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. ఇప్పటికే అప్ప లేని భాజపాను ఊహించటం కూడా కష్టమని విపక్ష నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆయనను తప్పిస్తే భాజపాకు అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌ సముదాయం కన్నెర్ర చేస్తుందన్న హెచ్చరికలు జోరందుకున్నాయి.

సర్వత్రా ఆసక్తి..

కర్ణాటక రాజకీయ చరిత్రలో 1990 నాటి లింగాయత ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ సంఘటన భాజపాను పదేపదే హెచ్చరిస్తోంది. లింగాయత ప్రతినిధిగా గెలిచిన వీరేంద్రపాటిల్‌ను వదులుకున్న కాంగ్రెస్‌ ఆపై ఆ సముదాయ ఓట్లను దక్కించుకోలేకపోయింది. ఆ పరిస్థితి భాజపాకు రాకూడదని జాగ్రత్త పడుతున్న అధిష్ఠానం యోచనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వైపు సామాజిక న్యాయం.. మరోవైపు యువ నాయకత్వం.. రాష్ట్రరాజకీయాల్లో తారాస్థాయి సమీకరణాలు మొదలయ్యాయి.

ఆ నేత కోసం..

సీఎం రేసులో ప్రముఖులు

ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, సామాజిక బలం, నాయకత్వ లక్షణం, ఉత్తర ప్రాంతవాసం.. ఈ సకల గుణాలున్న నేతను గుర్తించేందుకు దిల్లీలో పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది. ప్రహ్లాద్‌ జోషి, బి.ఎల్‌.సంతోశ్‌, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, తేజస్వి సూర్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, నాయకత్వ లక్షణాలున్నా కేవలం రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్న బ్రాహ్మణ సముదాయానికి చెందినవారు. బసవరాజ బొమ్మై లింగాయత్‌ సముదాయానికి చెందినా నాయకత్వ లక్షణాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కొరత కనిపిస్తోంది. బసవనగౌడ యత్నాళ్‌ ఉత్తర కర్ణాటక, లింగాయత్‌ సముదాయానికి చెందినా రాజకీయ నేతకు ఉండాల్సిన లౌక్యం మచ్చుకైనా లేదనేది అధిష్ఠానం మదింపు. ఇదే లక్షణాలున్న అరవింద బెల్లద్‌కు రాజకీయ అనుభవం కొరత.

నలుగురు ఉపముఖ్యమంత్రులు!

దిల్లీ చుట్టూ చక్కర్లు చేస్తున్న మురుగేశ్‌ నిరాణి లింగాయత్‌ సముదాయంతో పాటు అర్థ, అంగ బలం ఉన్నా ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు పార్టీలోని అత్యధికులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. డబ్బు బలం విపరీతంగా ఉన్న ఆయనకు చెప్పలేనన్ని సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజీనామాకు కూడా సిద్ధమని సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి గోవింద కారజోళ చెప్పటం గమనార్హం. ఇక ఒక్కలిగర సముదాయానికి చెందిన సి.టి.రవి కలుపుగోలు తనం లేని నేతగా, యడియూరప్ప వర్గానికి వ్యతిరేకిగా గుర్తింపు పొందారు. ఇదే సముదాయానికి చెందిన ఆర్‌.అశోక్‌, అశ్వత్థ నారాయణలకు బెంగళూరుకు పరిమితమైన నేతలన్న మచ్చ ఉంది. పార్టీలో సమతౌల్యాన్ని కాపాడే దిశగా కనీసం నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించే అవకాశం ఉంది. సీఎం పదవి తప్పినా సముదాయాలను సముదాయించే దిశగా ఆయా వర్గాల కీలక నేతలకు డీసీఎం పదవులు దక్కే అవకాశం ఉంది.

అయోమయంలో ఆ నేతలు

యడియూరప్ప ఇచ్చిన భరోసాతో కాంగ్రెస్‌, జనతాదళ్‌ నుంచి భాజపాలో చేరిన 17 మంది వలస నేతల్లో ఆందోళన మొదలైంది. అధిష్ఠాన నిర్ణయాన్ని ధిక్కరించి వలస నేతల్లో 13 మందికి మంత్రి పట్టా ఇప్పించగలిగిన యడియూరప్ఫ. ప్రస్తుతం రాజీనామా చేయటంతో కొత్త మంత్రివర్గంలో చోటుపై బెంగ మొదలైంది. కొత్త నాయకత్వమంతా అధిష్ఠాన కనుసన్నల్లోనే రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే మంత్రులుగా పని చేసిన సీనియర్లకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కటం కష్టంగా మారింది. పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్త, పాతల సమన్వయం జోరులో వలస నేతల పరిస్థితి అయోమయంలో పడనుంది.

ఇవీ చదవండి:

సీఎం రేసులో ఆ 9 మంది- అవకాశం ఎవరికి?

కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...

కమలదళంలో మాస్ లీడర్ల కొరత

యడియూరప్ప రాజీనామా- భవిష్యత్​పై కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details