తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2021, 4:01 PM IST

Updated : Jun 13, 2021, 4:36 PM IST

ETV Bharat / bharat

'మహా' రాజకీయాన్ని మార్చిన మోదీ-ఉద్ధవ్​ భేటీ!

ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. శివసేన నేత సంజయ్​ రౌత్, కాంగ్రెస్​ నాయకుడు నానా పటోలే వ్యాఖ్యలు, శరద్ పవార్​తో పీకే సమావేశం వంటి పరిణామాలు ఇందుకు మరింత బలాన్నిస్తున్నాయి. అయితే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్​ స్పష్టతనిచ్చారు.

Thackeray's meeting with PM Modi triggers speculations in Maharashtra politics
మోదీ-ఉద్ధవ్​ భేటీ తర్వాత 'మహా' రాజకీయాల్లో మార్పులు!

గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెరవెనుక అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ తర్వాత వచ్చిన స్పందనలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

మోదీ-ఉద్ధవ్ సమావేశం అనంతరం శివసేన సీనియర్​ నేత సంజయ్ రౌత్​ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. సేన తిరిగి ఎన్​డీఏలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్​ అఠవాలే సూచించారు. ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ కూడా శివసేనను ప్రశంసించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మహా రాజకీయాల్లో ఏదో జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.

మోదీపై రౌత్ ప్రశంసలు

అవకాశం దొరికినప్పుడల్లా భాజపాపై విరుచుకుపడే శివసేన నేత సంజయ్​ రౌత్.. మోదీ-ఉద్ధవ్​ భేటీ తర్వాత ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మోదీ దేశంలోనే అగ్ర నాయకులని, ప్రధాని కూడా అయినందున ఆయనను అందరూ గౌరవించాలన్నారు. భాజపా-శివసేన మధ్య ఉన్న విభేదాలు శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు సమసిపోతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఠాక్రే భేటీ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం సాధారణమేనని చెప్పారు.

'మహా వికాస్ అఘాడీకి ఢోకా లేదు'

సంజయ్​ రౌత్ వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్రలో మాహా వికాస్ అఘాడీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్​ మాత్రం దీన్ని తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం బలంగా ముందుకు సాగుతుందని, ఎవరూ దీన్ని కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు.

శివసేన తిరిగి రావాలని అఠవాలే సూచన..

మోదీ-ఉద్ధవ్ భేటీ అనంతరం కేంద్ర సహాయ మంత్రి అఠవాలే స్పందించారు. శివసేన తిరిగి ఎన్​డీఏలో చేరాలని ఆయన సూచించారు. ఎన్​సీపీ, కాంగ్రెస్​ ఉద్ధవ్​ను చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. భాజపాతో కలిసి శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, రెండు పార్టీలు సీఎం పదవీ కాలాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని అఠవాలే సలహా ఇచ్చారు.

కాంగ్రెస్ ఒంటరిగా పోటీ..

మరోవైపు తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రకటించడం చర్చనీయాంశమైంది. ప్రధాని కార్యాలయం దేశంలోనే అత్యున్నతమైందని, కానీ మోదీ దాన్ని అప్రతిష్ఠ పాలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్, సంజయ్ రౌత్ మధ్య మాటల యుద్ధ జరగడం ఇప్పటికే చూశామని పటోలే అన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కావడం తప్పేం కాదన్నారు.

ఈ నాయకుల భిన్న స్పందనలను నిశితంగా పరిశీలిస్తే సమీప భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పు తథ్యమని రాజకీయ విశ్లషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: మోదీతో మహారాష్ట్ర సీఎం ఠాక్రే భేటీ

Last Updated : Jun 13, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details