తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిగొచ్చిన ట్విట్టర్‌.. మరికొంత సమయం కావాలని విన్నపం!

కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టాల అమలుకు మరింత సమయం కావాలని ట్విట్టర్​ కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

By

Published : Jun 7, 2021, 10:53 PM IST

Updated : Jun 8, 2021, 7:01 AM IST

Twitter
ట్విట్టర్​

నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది వార్నింగ్‌ అనంతరం ట్విట్టర్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని.. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐటీ చట్టాల అమలుకు కొంత సమయం కావాలని ట్విట్టర్‌ యాజమాన్యం కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నూతన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు రెండు రోజుల క్రితం తుది నోటీసులు ఇచ్చింది. వీటిని అమలు చేయకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనల అమలులో ట్విట్టర్‌ వ్యవహారం సరిగ్గా లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ వ్యాఖ్యానించింది. గడువు ఇచ్చినప్పటికీ.. నిబంధనలను పాటించడంలో అలసత్వం వహిస్తే పర్యవసానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది.

నూతన నిబంధనల కింద ఆయా సంస్థలు చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విట్టర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విట్టర్‌ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. వీటిని వివరిస్తూ తాజాగా కేంద్రప్రభుత్వం తుది వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో స్పందించిన ట్విట్టర్‌ యాజమాన్యం మరికొంత సమయం కావాలని కోరింది.

ఇదీ చూడండి:ట్విట్టర్​కు కేంద్రం లాస్ట్ వార్నింగ్- దారికి రాకుంటే అంతే!

Last Updated : Jun 8, 2021, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details