తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2023, 1:00 PM IST

Updated : Mar 31, 2023, 5:00 PM IST

ETV Bharat / bharat

TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలు

SIT Inquiry in TSPSC Paper Leakage case: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల వ్యవహారంలో భాగంగా సిట్ చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలను సిట్ గుర్తించింది. అదే విధంగా దర్యాప్తులో వచ్చిన సమాచారంతో షమీమ్ ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

TSPSC Paper Leakage Issue
TSPSC Paper Leakage Issue

SIT Inquiry in TSPSC Paper Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మూడోరోజు నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్​డ్రైవ్​లో15 ప్రశ్నపత్రాలున్నట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే అందులో.. గ్రూప్-1, ఏఈఈ, డివిజినల్ అకౌంట్స్ అధికారి, ఏఈ పరీక్షలతో పాటు టౌన్ ప్లానింగ్, జూనియర్ లెక్చరర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ వన్ జనరల్ స్టడీస్ పేపర్​తో పాటు.. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ ఉద్యోగానికి సంబంధించిన పలు ప్రశ్నపత్రాలు పెన్​డ్రైవ్​లో ఉన్నాయి. ఏఈఈ పరీక్షకు సంబంధించి సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ పరీక్షా పత్రాలున్నాయి. డివిజినల్ అకౌంట్స్ అధికారి పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, మాథ్స్ ప్రశ్నపత్రాలను అధికారులు గుర్తించారు.

ఏఈ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ పేపర్ 1 ప్రశ్నపత్రాలు, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పేపర్ 2 ప్రశ్నపత్రాలు పెన్​డ్రైవ్​లో ఉన్నట్లు వారు తేల్చారు. టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి ఒకేషనల్, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు బయటపడ్డాయి. జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ ప్రశ్నపత్రాలు కూడా పెన్​​డ్రైవ్​లో గుర్తించారు. గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో వాటిని టీఎస్​పీఎస్సీ అధికారులు రద్దు చేశారు. ఇదే కాకుండా.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలను సైతం టీఎస్​పీఎస్సీ అధికారులు వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు.

షమీమ్ ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ స్వాధీనం : పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను మూడో రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. "షమీమ్ కంప్యూటర్ నుంచి ప్రశాంత్‌రెడ్డికి.. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ పంపించాడు. ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను షమీమ్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన రాజశేఖర్... పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారాన్ని చోరీ చేశాడు. తనపై నిఘా ఉండటంతో షమీమ్ కంప్యూటర్‌ను రాజశేఖర్ ఉపయోగించుకున్నట్టు" పోలీసులు గుర్తించారు. 'మరోవైపు గ్రూప్-1 కు షమీమ్‌ దరఖాస్తు చేసుకున్నట్లు రాజశేఖర్ గుర్తించి... తనకు కూడా ప్రశ్నాపత్రం ఇస్తానని చెప్పడంతో అతను అంగీకరించాడు.' అని సిట్​ తెలిపింది. దర్యాప్తులో వచ్చిన సమాచారంతో షమీమ్ ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేణుకకు బెయిల్ వస్తుందా ? : మరోవైపు ఇదే వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న రేణుక బెయిల్ పిటిషనపై ఇవాళ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇదివరకే రేణుక బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. అనారోగ్యంగా ఉన్నందున బెయిల్ ఇవ్వాలని రేణుక కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని దృష్టిలో ఉంచుకోవాలన్న ఆమె తరఫు న్యాయవాది.. మొదటి నుంచి విచారణకు సహకరిస్తుందని తెలిపారు. ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు మొదటి దశలోనే ఉందన్న సిట్‌ తరపు న్యాయవాది.. బెయిల్ ఇవ్వొద్దని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇదిలా ఉండగా ఇదే వ్యవహారంలో మరో ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి కోరింది. పేపర్‌ లీకేజీ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్‌ను కస్టడీకి అనుమతివ్వాలని పిటిషన్‌ వేసింది. ముగ్గురిని వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొంది. ముగ్గురి కస్టడీ పిటిషన్​ను నాంపల్లి కోర్టు నేడు విచారించునుంది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details