తౌక్టే తుపాన్ ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీనౌక పీ-305లో చిక్కుకున్న వారిలో 26 మంది మృతి చెందారు. ఈ మేరకు 26 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గల్లంతైన 49 మంది కోసం నౌకదళ సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు... రక్షణ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
తౌక్టే తుపాన్ ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీనౌక పీ-305లో 261 మంది చిక్కుకున్నారు. వారిలో 186 మందిని రక్షించారు. ఇవాళ 26 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు 125మందిని, ఇవాళ లభించిన 26 మృతదేహాలను ఐఎన్ఎస్ కొచి బుధవారం ముంబయికి తీసుకొచ్చింది. మరో 49మంది ఆచూకీ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు నౌకాదళం తెలిపింది. సహాయ చర్యల్లో ఐఎన్ఎస్ టెగ్, ఐఎన్ఎస్ బెత్వా, ఐఎన్ఎస్ బియాస్ సహా పీ81 యుద్ధ విమానం పాల్గొంటున్నాయి.ముంబయికి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో చమురు క్షేత్రాలు ఉన్నాయి. కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.