బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కేసులు భారత్లో పెరుగుతున్నాయి. బ్రిటన్ నుంచి దేశానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 20 మందికి కొత్త కరోనా సోకిందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన ఆరు కేసులతో పాటు మరో 14 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించింది.
దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ - Total 20 UK returnees to India have tested positive for the new COVID strain so far
![దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ Total 20 UK returnees to India have tested positive for the new COVID strain so far](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10053725-thumbnail-3x2-asdf.jpg)
07:55 December 30
దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఎనిమిది నమూనాలు కొత్త స్ట్రెయిన్కు పాజిటివ్గా తేలాయని వెల్లడించింది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఆస్పత్రిలో ఏడు, హైదరాబాద్ సీసీఎంబీలో రెండు నమూనాలు కొత్త వైరస్కు చెందినవేనని గుర్తించినట్లు పేర్కొంది. కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్, పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో ఒక్కో కేసు చొప్పున నిర్ధరణ అయినట్లు తెలిపింది.
బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసొలేషన్లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, క్వారంటైన్కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్ కేసులు నిర్ధరణ కావడం వల్ల ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.
కొత్త వైరస్ను నిర్ధరించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఏడు ల్యాబ్లు ఇప్పటికే ఫలితాల్ని వెల్లడించాయి. పది ప్రయోగశాలల్లో ఇప్పటి వరకు 107 నమూనాల్ని పరీక్షించారు.
నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య మొత్తం 33వేల మంది బ్రిటన్ నుంచి భారత్కు తిరిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది. వీరందరినీ గుర్తించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని వెల్లడించింది. లండన్లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన భారత్ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అలాగే కొవిడ్పై ఏర్పాటైన ప్రత్యేక జాతీయ కార్యదళం డిసెంబరు 26న సమావేశం నిర్వహించి కొత్త రకంపై సమీక్ష చేసింది. పరీక్ష, గుర్తింపు, చికిత్స వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందించింది.