తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2021, 5:46 AM IST

Updated : Mar 13, 2021, 7:06 AM IST

ETV Bharat / bharat

'మోదీకి భయపడే.. రైతు ఉద్యమానికి విపక్షాలు దూరం'

మోదీ ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుంటుందేమోనన్న భయంతోనే రైతు ఉద్యమానికి విపక్షాలు తగిన మద్దతు ఇవ్వడం లేదని అన్నారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్. కేంద్రంలో ఇద్దరు వ్యక్తుల పాలన మాత్రమే నడుస్తోందని.. వారు ఎవరి గళాన్ని వినిపించుకోరని వ్యాఖ్యానించారు.

RAKESH TIKAIT
'మోదీకి భయపడే.. రైతు ఉద్యమానికి విపక్షాలు దూరం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి విపక్ష పార్టీలు తగిన మద్దతు ఇవ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. మోదీ ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుంటుందనే భయంలో వారు ఉన్నారని పేర్కొన్నారు. రాజస్థాన్ జోధ్​పుర్​లో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్​కు హాజరైన ఆయన.. కేంద్రంలో ఇద్దరు వ్యక్తుల పాలన మాత్రమే నడుస్తోందని ధ్వజమెత్తారు. వారు ఎవరి గళాన్ని వినిపించుకోరని అన్నారు.

"విపక్షాలు బలహీన స్థితిలో ఉన్నాయి. రైతుల సమస్యలపై మాట్లాడలేకపోతున్నాయి. వారు చేసిన పాత పనులు ఇప్పుడు వారికి అడ్డుగా వస్తున్నాయి. ఏదైనా సమస్యల్లో లేదా దర్యాప్తుల్లో ఇరుక్కుంటామని భయపడుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఉంటే చర్చలు జరిపేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తుల పాలన నడుస్తోంది. ఈ పాలన ఎవరి అభిప్రాయాలను వినిపించుకోదు. ఇది ప్రభుత్వం కాదు... ఓ కంపెనీ. ఎప్పటికైనా ఇది దిగిపోవాల్సిందే."

-రాకేశ్ టికాయిత్, రైతు నాయకుడు

'ప్రస్తుతానికైతే నవంబర్ వరకు తమ ఉద్యమం కొనసాగుతుంది' అని టికాయిత్ పేర్కొన్నారు. దీనికి యువత మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తమ పోరు.. భూమిని పరిరక్షించేందుకేనని అన్నారు. 20-30 ఏళ్లలో దేశంలోని ప్రతి రైతు తన భూమిని కోల్పోతాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంతో పోరాడితేనే దీన్ని నివారించగలమని తెలిపారు.

'మనస్సాక్షిని కదిలిస్తుందేమో'

మరోవైపు, సాగుచట్టాలపై ప్రధాని మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఇచ్చిన సందేశం ఆయన మనస్సాక్షిని కదిలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించన రైతుల పట్ల కేంద్ర మొండి వైఖరి అవలంబించడం దురదృష్టకరమని అన్నారు.

ఇదీ చదవండి:'ఆయుర్వేద ప్రాచుర్యానికి ఇదే సరైన సమయం'

Last Updated : Mar 13, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details