తెలంగాణ

telangana

సీఎం రేసులో ఆ 9 మంది- అవకాశం ఎవరికి?

By

Published : Jul 26, 2021, 2:46 PM IST

Updated : Jul 26, 2021, 6:13 PM IST

యడియూరప్ప రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎం ఎంపికపై భాజపా కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున ఓ పరిశీలకుడిని కర్ణాటకకు పంపనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించుకుని.. యడ్డీ వారసుడిపై ఓ నిర్ణయానికి రానున్నారు. కొత్త సీఎం ఎంపిక పూర్తయ్యే వరకు యడియూరప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

Karnataka new CM
కర్ణాటక కొత్త సీఎం

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప. రాష్ట్రంలో భాజపా సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే సీఎం పీఠం నుంచి ఆయన వైదొలిగారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నేతకు పగ్గాలు అప్పజెప్పాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున ఓ పరిశీలకుడిని కర్ణాటకకు పంపనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించుకుని.. యడ్డీ వారసుడిపై ఓ నిర్ణయానికి రానున్నారు.

సీఎం రేసులో ఉన్నది వీరేనా?

యడియూరప్ప రాజీనామా తరువాత.. సీఎం రేసులో పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

  • ప్రహ్లాద్​ జోషీ- కేంద్ర మంత్రి
  • విశ్వేశ్వర్​ హెగ్డే ఖగేరీ- కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
  • సీఎన్​. అశ్వత్​ నారాయణ - కర్ణాటక డిప్యూటీ సీఎం
  • బసవరాజ్ బొమ్మై- కర్ణాటక హోం మంత్రి
  • ఆర్. అశోక- కర్ణాటక ఆర్థిక మంత్రి
  • ఎం. మురుగేశ్​ నిరాణి- కర్ణాటక మంత్రి
  • సీటీ రవి- భాజపా జాతీయ జనరల్ సెక్రటరీ
  • డీవీ సదానంద గౌడ- కేంద్ర మాజీ మంత్రి
  • అరవింద్​ బెల్లాడ్- ఎమ్మెల్యే

ఇందులో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజు. ఈయనకు సీఎం పదవి ఇవ్వాలని యడియూరప్ప సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఎవరి పేరు సూచించలేదని యడ్డీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ కూడా సీఎం రేసులో ఉన్నారు. వీరంతా లింగాయత్‌ వర్గానికి చెందినవారే. రాష్ట్రంలో భాజపా ఓటు బ్యాంకులో లింగాయత్‌లదే అధిక వాటా. యడియూరప్ప కూడా లింగాయత్‌ వర్గానికి చెందినవారే. దీంతో వీరిలో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి.

సీనియర్​ నేతలకు బాధ్యతలు..

ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా చేసిన క్రమంలో.. తదుపరి సీఎం ఎంపికకు కసరత్తు చేపట్టింది భాజపా అధిష్ఠానం. రాష్ట్రంలోని పరిస్థితులు, సీఎం రేసులో ఉన్న నేతల స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర పరిశీలకులుగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​, కర్ణాటక భాజపా ఇన్​ఛార్జి అర్జున్​ సింగ్​లకు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇతర వర్గాల ఓటు బ్యాంకునూ..

అయితే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర వర్గాల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల నుంచి బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది.

దీంతో ఈ సారి ఓబీసీ లేదా ఒక్కళిగ వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...

యడియూరప్ప రాజీనామా- భవిష్యత్​పై కీలక వ్యాఖ్యలు

కర్ణాటకకు కొత్త సీఎం ఎవరు?

Last Updated : Jul 26, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details