కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న దేశం ఊపిరి పీల్చుకోనుంది. కొవిడ్-19 వ్యాక్సినేషన్కు భారత్ సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
- పంపిణీ కేంద్రాలు: 3006
- ఎంతమందికి: 3 లక్షల మంది
- సందేహాల కోసం: 1075 టోల్ ఫ్రీ నెంబరు
ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి.. చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొంది.
ఇవి గుర్తుంచుకోవాలి..
- కొవిడ్ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.
- యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్ టీకా ఇవ్వాలి.
- గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.
- కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
- టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.
తొలి దశలో ఎవరికి?
- ఫ్రంట్లైన్ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ కార్యకర్తలు
- నర్సులు, సూపర్వైజర్లు
- వైద్య అధికారులు
- పారామెడికల్ సిబ్బంది
- సహాయక సిబ్బంది
- వైద్య విద్యార్థులు
రెండోదశలో..
- ఫ్రంట్లైన్ వర్కర్లు
- మున్సిపల్ కార్మికులు