cbi investigation : వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి తొలి రోజు సీబీఐ కస్టడీ ముగిసింది. ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు దాదాపు ఐదున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10.40 నిమిషాల సమయంలో ఇద్దరు నిందితులను చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. 11గంటల సమయంలో విచారణ ప్రారంభించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వేర్వేరుగా ఉంచి న్యాయవాదికి కనిపించే విధంగా ప్రశ్నించారు.
ప్రశ్నల పరంపర.. వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలు చేరివేయడంతో పాటు... రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా తలకు బ్యాండేజ్ చుట్టిన విషయాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. దీనికి అతను చెప్పిన సమాధానాలను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నావనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 2019 మార్చి 15వ తేదీన తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారనే విషయాలను ఉదయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
భాస్కర్ రెడ్డిని.. వైఎస్ వివేకా హత్యకు నెల ముందే కుట్ర జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన సీబీఐ అధికారులు... దానికి సంబంధించిన వివరాలను వైఎస్ భాస్కర్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం 9 గంటలకు రెండో రోజు కస్టడీలో భాగంగా తిరిగి సీబీఐ కార్యాలయానికి తీసుకురానున్నారు.