సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.
రోజు మొత్తం మీద విపక్షాల నిరసనలతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. పరిస్థితిలో మార్పులేకపోవడం వల్ల చివరికి మంగళవారానికి వాయిదా వేశారు.
లోక్సభలో..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament winter sessions) ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్.
ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ(Parliament winter sessions) విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా పడింది.
తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
రాజ్యసభలో..
రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సమయానే గంట సేపు వాయిదా పండింది. విపక్షాల ఆందోళనలు సహా ఇటీవల మృతి చెందిన ప్రస్తుత సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్పై గౌరవ సూచకంగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో సభ మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.
సభ తిరిగి ప్రారంభం కాగానే.. సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు అంగీకరించకపోవటం వల్ల ఆందోళనకు చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు వైస్ ఛైర్మన్. సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా మరోమారు అర్ధగంటపాటు వాయిదా పడింది.