Action Illegal Liquor in Telangana : మద్యం విక్రయాలు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో.. తెలంగాణ ఆబ్కారీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని వేదికగా చేసుకుని ప్రయాణికుల్ని సోదాలు చేయడం ఆరంభించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికారులు విమానాశ్రయం బయట.. డొమెస్టిక్ ప్రయాణికుల సూటుకేసులు, బ్యాగులు తెరిపించి మరీ సోదాల్లో చేశారు.
తొమ్మిది రోజులుగా గోవా, దిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి.. రూ.16.24లక్షలు విలువ చేసే 1302 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 85 కేసులు నమోదు చేసి... 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు.. రెండు బాటిళ్ల వరకూ అనుమతి ఉందని.. కానీ సుంకం చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క సీసా తెచ్చినా ఉల్లంఘనేనని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.
కేసు నమోదు చేస్తాం :అంతర్జాతీయ విమాన ప్రయాణికులు 2 లీటర్ల వరకు విదేశీ మద్యాన్ని దర్జాగా తెచ్చుకుంటుంటే.. ఒక్క లీటర్ తెచ్చుకున్నా తమపై కేసులేంటని స్వదేశీ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సవరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీశాఖ... తమ రాష్ట్రంలో తయారుకానీ మద్యం సీసా ఒక్కటైనా సరే బయట నుంచి తెచ్చుకుంటే.. కేసు నమోదు చేస్తామని తెలిపింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అలాంటి మార్పు చేయకుండానే.. కనీసం అవగాహన కల్పించకుండానే కేసులు పెట్టడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిఘా పెంచిన ఎక్సైజ్ అధికారులు : శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే కాదు.. రోడ్డు రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెంచారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. హరియాణా నుంచి డీసీఎంలో తీసుకొస్తున్న 1600లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. 15 మందిని అరెస్టు చేశారు. మూడు కార్లు, ఒక కంటైనర్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.