తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 4:51 PM IST

ETV Bharat / bharat

ఆక్సిజన్ కొరత.. 100 మందిని కాపాడారిలా!

ఆక్సిజన్ కొరత.. ఓ ఆస్పత్రిలోని రోగులు, కుటుంబ సభ్యులను ముప్పతిప్పలు పెట్టింది. ఆస్పత్రి యాజమాన్యానికి చెమటలు పట్టించింది. మరో జైపుర్ గోల్డెన్ ఆస్పత్రి తరహా ఘటన జరుగుతుందేమోనన్న ఆందోళనకు దారి తీసింది. ఆక్సిజన్ కోసం ఆస్పత్రి వర్గాలు హైకోర్టుకు వెళ్లినా పరిస్థితి అప్పటికప్పుడు చక్కబడలేదు. అయితే.. ఆస్పత్రి, ప్రభుత్వ వర్గాల సమష్టి కృషితో ముప్పు తప్పింది.

How Saroj Hospital saved over 100 lives
ఆక్సిజన్ కొరత.. వంద మందిని కాపాడారిలా!

2021 ఏప్రిల్ 24.. శనివారం మధ్యాహ్నం.. దిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట రోగుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు. ఆస్పత్రి లోపల తమ కుటుంబీకులు అల్లాడుతున్న వైనం చూసి అధికారులను వేడుకుంటూ కన్నీరు కారుస్తున్న దయనీయమైన పరిస్థితి. 100 మందికి పైగా రోగులకు చికిత్స నిలిచిపోయే ప్రమాదం. మరో జైపుర్ గోల్డెన్ ఆస్పత్రి తరహా ఘటన జరుగుతుందేమోనని అందరిలో ఆందోళన. దీనంతటికీ ప్రధాన కారణం ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడమే.

"ఆ సమయంలో ఏం చేయాలో మాకు తెలియలేదు. రోగులను డిశ్ఛార్జ్ చేయడం ప్రారంభించాం. ఆక్సిజన్ లేదు కాబట్టి వేరే ఆస్పత్రులకు రోగులను తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించాం."

-పంకజ్ చావ్లా, ఆస్పత్రి యజమాని

సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఓ ట్రస్టు నడిపిస్తోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడటం వల్ల 34 మంది రోగులను అప్పటికప్పుడు వేరే ఆస్పత్రికి తరలించింది. మిగిలిన రోగులంతా వెంటిలేటర్లపై ఉన్న నేపథ్యంలో.. ఆక్సిజన్ సిలిండర్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు.

"రోగుల కుటుంబ సభ్యుల్లో చాలా వరకు ఇక్కడే ఉండేందుకు మొగ్గు చూపారు. వేరే ఆస్పత్రికి వెళ్లినా పరిస్థితి ఇలాగే ఉంటుందని, జరిగేదేదో జరుగుతుందని అన్నారు. 34 మంది మాత్రం వెళ్లేందుకు సిద్ధమయ్యారు."

-పంకజ్ చావ్లా, ఆస్పత్రి యజమాని

అత్యవసర సహాయం అందేలా చూడాలని హైకోర్టును సైతం ఆశ్రయించారు ఆస్పత్రి వర్గాలు. అయినా వెంటనే సహాయం అందలేదు. దీంతో ఇతర ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను అడిగి తీసుకొచ్చారు. దీనికి దిల్లీ ప్రభుత్వ అధికారులు పరోక్షంగా సహకరించారు. అయితే.. అప్పటికీ పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందుబాటులోకి రాలేదు.

ట్యాంకర్ వచ్చినా..

ఆ సమయంలో అధికార యంత్రాంగం ఏమాత్రం అలసత్వం వహించినా.. వంద మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవేమో. కానీ అలా జరగలేదు. ప్రభుత్వ అధికారులు, పోలీసులతో ఆస్పత్రి వర్గాలు.. నిరంతరం ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపాయి. ఆక్సిజన్ సరఫరాదారులతో మాట్లాడాయి. వీటన్నింటి మధ్య ఆక్సిజన్ ట్యాంకర్ రానే వచ్చింది. దిల్లీ ప్రభుత్వం షేరింగ్ పద్ధతిలో ఓ ట్యాంకర్​ను ఈ ఆస్పత్రికి కేటాయించింది. కానీ, మళ్లీ ఆటంకమే! ఆస్పత్రికి ముందు వరకు వచ్చిన ఈ ట్యాంకర్.. లోనికి రాలేని పరిస్థితి.

"ఆస్పత్రికి ట్యాంకర్ వచ్చింది. కానీ, అది మా ఎల్ఎంఓ(లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ఉండే ప్రాంతానికి రాలేనంత పెద్దదిగా ఉంది. దీంతో డ్రిల్లర్లు, సుత్తులతో అక్కడి గోడలను పగలగొట్టేందుకు ప్రయత్నించాం. కానీ సమయం అంతా వృథా అయిపోయింది. ట్యాంకర్ తీరథ్ రామ్ షా ఆస్పత్రికి వెళ్లాల్సిన సమయమైంది."

-పంకజ్ చావ్లా, ఆస్పత్రి యజమాని

మరో గంట తర్వాత మళ్లీ ఆస్పత్రికి పంపిస్తామని చెప్పి.. ఆక్సిజన్ ట్యాంకర్​ను తీరథ్ రామ్ షా ఆస్పత్రికి పంపించారు దిల్లీ ప్రభుత్వ అధికారులు. దీంతో అక్కడి రోగుల కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

"ఇక మమ్మల్ని ఇంకెవరూ కాపాడలేరని అనుకున్నాం. మా వైద్యులు, సిబ్బంది.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏడవడం ప్రారంభించారు. మాకు అదృష్టం కూడా కలిసిరాలేదు. అనంతరం, దిల్లీ ఆర్టీసీ బస్సులో 20 ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రికి తెప్పించాం. ఇవి 40 నిమిషాల పాటు పనిచేశాయి. ఆ రోజు మమ్మల్ని కాపాడింది ఈ సిలిండర్లే."

-పంకజ్ చావ్లా, ఆస్పత్రి యజమాని

అదే సమయంలో.. స్థానిక మేయర్​తో పాటు అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించినట్లు చావ్లా వివరించారు. గోడను తొలగించేందుకు ఓ జేసీబీని రంగంలోకి దించినట్లు చెప్పారు. వెంటనే తీరథ్ ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్​ను అధికారులు మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం 100 మంది రోగులు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో చాలా మంది ఆక్సిజన్​పైనే ఉన్నారు. పరిస్థితులు మరింత కఠినంగా మారి ఉంటే.. మరో జైపుర్ గోల్డెన్ ఘటన జరిగేదని చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే.. ఘటన తీవ్రత ఎన్నో రెట్లు అధికంగా ఉండేదని అన్నారు. ఈ సమయంలోనూ ఆస్పత్రిలోనే ఉండి రోగుల కుటుంబ సభ్యులు తమకు సహకరించారని కొనియాడారు.

ఇదీ చదవండి-సుప్రీంకోర్టు ప్రాంగణంలో కొవిడ్ ఆస్పత్రి!

ABOUT THE AUTHOR

...view details