తెలంగాణ

telangana

By

Published : May 17, 2021, 10:17 PM IST

ETV Bharat / bharat

గుజరాత్‌ తీరాన్ని తాకిన 'తౌక్టే' తుపాను

'తౌక్టే' తుపాను ఎట్టకేలకు గుజరాత్​ తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తౌక్టే ధాటికి వేర్వేరు ఘటనల్లో.. కర్ణాటకలో ఎనిమిది మంది చనిపోగా, మహారాష్ట్రలో ఆరుగురు మరణించారు.

Tauktae Cyclone
తౌక్టే తుపాను

అరేబియా తీర ప్రాంతాలను హడలెత్తిస్తున్న తౌక్టే తుపాను సోమవారం రాత్రి.. గుజరాత్​ తీరాన్ని తాకింది. ఆ రాష్ట్రంలోని పోర్​బందర్​-మహువా మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర తీరంలో గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయంది. రెండు గంటలపాటు ఇది తీవ్ర ప్రభావం చూపి.. ఆ తర్వాత బలహీనపడే అవకాశముందని వెల్లడించింది.

తౌక్టే ప్రభావంతో.. వెరవల్​-సోమనాథ్​ తీరంలో భారీఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తుపాను ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు.. గుజరాత్​లో ఇప్పటికే సుమారు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా.. 54 ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు మోహరించాయి.

విమానాశ్రయాలు బంద్​..

తుపాను కారణంగా గుజరాత్​లో విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. రాజ్​కోట్​ విమానాశ్రయం మినహా.. అన్ని విమానాశ్రయాలను ఈ నెల 19 వరకు మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో మూడు విమానాశ్రయాలు అహ్మదాబాద్​, సూరత్, వడోదర విమానాశ్రాయాలు మంగళవారం వరకు మూతపడనున్నాయి.

కర్ణాటకలో 121 గ్రామాలపై ప్రభావం..

తౌక్టే తుపాను ధాటికి కర్ణాటకలోని సుమారు 121 గ్రామాలు ప్రభావితమయ్యాయి. బాధిత గ్రామాల్లో గరిష్ఠంగా.. ఉత్తర కన్నడ జిల్లాలోని 48 గ్రామాలున్నాయి. ఆ రాష్ట్రంలోని మల్నాడ్​ జిల్లా పరిసర ప్రాంతాల్లో పడవ మునక సహా పలు వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలో ఆరుగురు మృతి..

'తౌక్టే' ప్రభావంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంగతో వీస్తున్న గాలులు మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించాయి. తుపాను బీభత్సంతో.. కొంకణ్​ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు పడవలు నీట మునగగా.. ముగ్గురు నావికుల ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం మహారాష్ట్ర తీరం దాటి వెళ్లనుండగా.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

ABOUT THE AUTHOR

...view details