తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీకి షాక్​- నందిగ్రామ్​లో మమత ఓటమి

బంగాల్​ దంగల్​లో అత్యంత కీలక ఘట్టానికి తెరపడింది. యావత్​ దేశం ఎదురుచూసిన నందిగ్రామ్​ రణంలో సువేందు అధికారి విజయఢంకా మోగించారు. దీదీపై చారిత్రక గెలుపుతో తన రాజకీయ భవితను మరింత సుస్థిరం చేసుకున్నారు.

By

Published : May 2, 2021, 7:34 PM IST

Updated : May 3, 2021, 12:13 AM IST

suvendu and mamata
నందిగ్రామ్​లో మమతపై సువేందు విజయ భేరీ

ఆఖరి రౌండ్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన బంగాల్‌లోని నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించారు. ఆది నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రోజు ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రతి రౌండ్​కు ఆధిక్యం మారుతూ వచ్చింది. ఓ దశలో 1200 ఓట్లతో మమత గెలిచారన్న వార్తలు వచ్చాయి. అనూహ్యంగా కాసేపటికే పరిస్థితి తారుమారైంది. సువేందు మమతపై 1,956 ఓట్ల తేడాతో గెలిచారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

బంగాల్‌లో మూడింట రెండొంతుల సీట్లతో తృణమూల్‌ను విజేతగా నిలిపిన మమత బెనర్జీ... తాను పోటీ చేసిన నందిగ్రామ్‌లో మాత్రం ఓటమి చవిచూశారు.

అన్నీ తెలిసినవాడై...

10ఏళ్ల పాటు మమతా బెనర్జీకి కుడిభుజంగా పని చేశారు సువేందు. నందిగ్రామ్​ ఉద్యమంలో వారిది కీలక పాత్ర! కానీ పార్టీపై అసంతృప్తితో.. ఎన్నికలకు కొద్ది నెలల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి మమత-సువేందు పోరు ఆసక్తిగా మారింది.

సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్​ నుంచే తానూ పోటీ చేస్తానని ప్రకటించి దేశాన్ని ఆశ్చర్యానికి గురుచేశారు మమత. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకున్నారు. వీరి మధ్య అనేకమార్లు మాటల తూటాలూ పేలాయి. గెలుపుపై ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు.

సువేందు విజయం...

అయితే కంచుకోటను సువేందు నిలబెట్టుకోవడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • తృణమూల్‌ బలాలు, బలహీనతలన్నీ తెలిసి ఉండటం
  • 'నందిగ్రామ్​ బిడ్డ'ను అంటూ ప్రజల్లోకి వెళ్లడం
  • మమతపై 'బయటి మనిషి' అని ప్రజల్లో ముద్ర వేయడం
  • దీదీపై అప్పటికే ప్రజల్లో ఉన్న అసంతృప్తి
  • నందిగ్రామ్​ను దీదీ పట్టించుకోలేదన్న వాదన

దీదీకి ఉన్న ప్రతికూలతలను తన అనుకూలతలుగా మలచుకుని ముందుకెళ్లారు సువేందు. ఇందుకో భాజపా పెద్దల నుంచి బలమైన మద్దతు కూడా లభించింది. ఫలితంగా మెగా వార్​లో విజేతగా నిలిచి మరోమారు తన సత్తా చాటారు సువేందు.

దీదీ పరిస్థితి...!

సువేందుతో ప్రత్యక్ష పోరుకు దిగి సాహసం చేసినప్పటికీ.. ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న దీదీ వ్యూహం బెడిసికొట్టిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో తృణమూల్​ కాంగ్రెస్​ విజయం సాధించినప్పటికీ.. నాయకురాలే ఓడిపోవడం పార్టీ శ్రేణులను కలవరపెట్టే విషయం అని అంటున్నారు. ముఖ్యంగా.. సువేందుపై యుద్ధంలో ఓడిపోవడం దీదీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు.

మరి ఇప్పుడు దీదీ తదుపరి వ్యూహాలు ఏంటి? అనేది వేచి చూడాల్సిన విషయం.

ఇదీ చూడండి:సవాళ్లే 'విజయ'న్​ సోపానాలు

Last Updated : May 3, 2021, 12:13 AM IST

ABOUT THE AUTHOR

...view details