తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 7:40 AM IST

ETV Bharat / bharat

Sukhoi 30 Mki India : స్వదేశీ మంత్రంతో భారత్​.. సుఖోయ్‌లు.. సర్వే నౌకలు.. రూ.45వేల కోట్లతో రక్షణశాఖ​ డీల్​!

Sukhoi 30 Mki India : ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి ధ్రువస్త్ర, 12 సుఖోయ్‌ 30-MKI యుద్ధ విమానాలు సహా వివిధ ఆయుధ వ్యవస్థలను రూ.45వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది.

Sukhoi 30 Mki India
Sukhoi 30 Mki India

Sukhoi 30 Mki India :దేశ భద్రతా దళాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.45 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. అందులో 12 సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలు, ధ్రువాస్త్ర క్షిపణుల సమీకరణ, డోర్నియర్‌ విమానాల ఆధునికీకరణ వంటివి ఉన్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ).. మొత్తం తొమ్మిది ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదం తెలిపింది.

Sukhoi 30 Mki Deal : 'ఆత్మనిర్భర్‌ భారత్‌' దిశగా.. స్వదేశీ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రక్షణ ఉత్పత్తుల్లో స్వదేశీ సామగ్రి వినియోగాన్ని 50 శాతం నుంచి 60-65 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

డీఏసీ ఆమోదం తెలిపిన ప్రతిపాదనలు

  • తేలికపాటి సాయుధ బహుళ ప్రయోజన వాహనాలు (ఎల్‌ఏఎంవీ), సమీకృత నిఘా, లక్ష్య వ్యవస్థ (ఐఎస్‌ఏటీ-ఎస్‌).
  • శతఘ్నులు, రాడార్లను వేగంగా తరలించడానికి, మోహరించడానికి హై మొబిలిటీ వెహికల్‌, గన్‌ టోయింగ్‌ వాహనాలు.
  • నౌకాదళం కోసం సర్వే నౌకలు.
  • దేశీయంగా నిర్మించిన ఏఎల్‌హెచ్‌ ఎంకే-4 హెలికాప్టర్ల కోసం స్వదేశీ ధ్రువాస్త్ర స్వల్పశ్రేణి క్షిపణులు.
  • హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సామగ్రితో రూపొందించే 12 సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానాలు.

డోర్నియర్‌ విమానాల్లోని ఏవియానిక్స్‌ను ఆధునికీకరించాలన్న వైమానిక దళ ప్రతిపాదనలకు కూడా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఈ లోహవిహంగాల కచ్చితత్వం పెరుగుతుందని చెప్పింది. అయితే గత కొద్దిరోజులుగా పలు సందర్భాల్లో ఈ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఆధునికీకరణ అవసరమైంది.

100 యుద్ధవిమానాలకు ఆర్డర్​!
కొద్ది రోజుల క్రితం.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 100 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపారు. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో మరో 100 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ 100 తేలికపాటి యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని.. త్వరలోనే వాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనల విలువ రూ.66వేల కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది.

నేవీ కోసం రఫేల్ జెట్లు.. రూ.90వేల కోట్లతో ఫ్రాన్స్​తో డీల్! మోదీ టూర్​లో ఖరారు!

రఫేల్‌ యుద్ధవిమానాలకు 'మేక్ ఇన్​ ఇండియా​' టచ్​.. పాక్​, చైనాకు చుక్కలే!

ABOUT THE AUTHOR

...view details