మంచుప్రాంత చేప.. అత్యంత అరుదైన రకం చేప ఇది. ఎంతో రుచికరంగా ఉండే ఈ చేపలు.. శీతల వాతావరణంలో మాత్రమే బతుకుతాయి. వీటి పెంపకానికి కశ్మీర్లోని వాతావరణ పరిస్థితులు సరిగ్గా సరిపోతాయి. 1889లో ఓ బ్రిటిష్ అధికారి ఫ్రాంక్ జాన్ మిషెల్.. ఈ రకం చేపను కశ్మీర్కు మొదటిసారిగా తీసుకొచ్చారు. అప్పటినుంచి దక్షిణ కశ్మీర్, అనంత్నాగ్ జిల్లాలోని కోకర్నాగ్లో ఏర్పాటు చేసిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఈ మంచుప్రాంత చేపల పెంపకం పెద్దఎత్తున జరుగుతోంది. 38 ఎకరాల భూమిలో 30కు పైగా కాలువలకు ఈ కేంద్రం విస్తరించింది.
"మంచుప్రాంత చేపల పెంపకం చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్దది. రెయిన్బో చేపలను మాత్రమే ఇక్కడ పెంచుతాం. ఈ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని తాజా చేపల్లో ఒమేగా-6 ఉంటుంది కానీ శీతల చేపలు మాత్రం పెద్దసంఖ్యలో ఒమేగా-3ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాలు పలు హృద్రోగాల నుంచి కాపాడతాయి. చదువుకున్న యువతీయువకులు ముందుకొచ్చి, ఈ చేపల పెంపకాన్ని చేపట్టాల్సిందిగా సూచిస్తున్నాను. ఇదో మంచి లాభదాయకమైన వ్యాపారం.
-- మొహమ్మద్ ముజఫర్, ప్రాజెక్టు ప్రధాన అధికారి
ఆసియాలే అతి పెద్దది..
ఓ ఐరోపా సంస్థ సహకారంతో 1984లో ఈ బ్రీడింగ్ సెంటర్ను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రం ఆసియాలోనే చేపల సాగు చేస్తున్న అతిపెద్ద క్షేత్రంగా పేరుగాంచింది. శీతల చేపల అమ్మకం ద్వారా 2020లో మత్య్సశాఖకు కోటీ 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.