తెలంగాణ

telangana

కశ్మీర్‌లో జవాన్ అదృశ్యం.. కారులో రక్తపు మరకలు.. ఉగ్ర చర్యేనా!

By

Published : Jul 30, 2023, 1:20 PM IST

Updated : Jul 30, 2023, 2:26 PM IST

Soldier Missing In Kashmir : కశ్మీర్‌లో ఓ సైనికుడు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు జవాన్‌ ప్రయాణించిన వాహనం రక్తపు మరకలతో దొరకగా.. సైన్యం అప్రమత్తమైంది. సైనికుడి అదృశ్యం ఉగ్రవాదుల పనే అన్న అనుమానంతో అణువణువు జల్లెడ పడుతోంది. గతంలో ఇలా అదృశ్యమైన సైనికులు ముష్కరుల చేతిలో దారుణహత్యకు గురైనందున కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన బిడ్డను వదిలిపెట్టాలని బాధితుడి తల్లి వీడియో సందేశం విడుదల చేశారు.

Soldier Missing In Kashmir
Soldier Missing In Kashmir

Soldier Missing In Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఇండియన్‌ ఆర్మీ సైనికుడు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. కుల్గామ్‌ జిల్లాలోని అచతల్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల జావేద్‌ అహ్మద్‌ వానీ భారత సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నారు. లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటుకు చెందిన జావేద్.. లద్దాఖ్‌లోని లేహ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కుల్గామ్‌ జిల్లాలో నివసించే ఆయన.. సెలవులపై ఇంటికి వచ్చి అదృశ్యమయ్యారు. ఆదివారం విధుల్లో చేరాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు జావేద్‌ అహ్మద్‌.. రాత్రి అయినా తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పరన్హాల్‌ సమీపంలో అతని కారును గుర్తించారు. కారుకు లాక్‌ వేయకపోగా అందులో జావేద్‌ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, కారులో రక్తపుమరకలు ఉన్నాయనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.

అదృశ్యమైన సైనికుడు
జవాన్​ కోసం గాలిస్తున్న సైన్యం

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగాయి. జవాన్‌ జాడ కోసం ఆర్మీ, పోలీసులు ముమ్మరంగా.. గాలింపు చేపట్టారు. భద్రతా దళాలు కారు కనిపించిన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని.. జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సెలవుపై ఇంటికి వచ్చిన కొంతమంది సైనికులను ఉగ్రవాదులు అపహరించి కడతేర్చిన ఘటనలు గతంలో జరిగాయి. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి బోరున విలపిస్తున్నారు. తన కుమారుడిని విడుదల చేయాలని జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ కుటుంబాన్ని పోషించేది అతడు ఒక్కడే అని.. అతణ్ని విడిచిపెట్టాలని సైనికుడి తండ్రి విజ్ఞప్తి చేశాడు.

తమ కుమారుడ్ని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్న జావెద్​ తల్లిదండ్రులు

'నా కుమారుడిని ప్రాణాలతో విడుదల చేయాలని.. సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అతడు ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే.. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. వారు కోరుకుంటే నేను అతడిని మళ్లీ సైన్యంలోకి పంపించను.'
-- మహ్మద్​ ఆయుబ్​ వనీ, సైనికుడి తండ్రి

గతంలో ఇలానే సెలవుపై వెళ్లిన సైనికులపై ఉగ్రవాదులు దాడులు జరిపిన ఘటనలు ఉన్నాయి. 2018లో సైన్యంలోని 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబు అనే సైనికుడు కూడా సెలవుపై ఇంటికి వచ్చాడు. అప్పట్లో అతడిని హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను సైన్యం ఆ తర్వాత మట్టుబెట్టింది. అనంతరం రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబుకు ప్రభుత్వం శౌర్యచక్రను బహూకరించింది.

Last Updated : Jul 30, 2023, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details