TSPSC Exam Paper Leak Case Updates: ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రవీణ్ పెన్డ్రైవ్ను విశ్లేషించినప్పుడు కొన్ని ప్రశ్నాపత్రాలు బయటపడ్డాయి. అందులో ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు.. ఈ నెల 12, 15,16 తేదీల్లో జరగాల్సిన టౌన్ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్ ప్రశ్నాపత్రాలున్నట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో ఈ నెల 5న నిర్వహించిన.. ఏఈ పరీక్షను టీఎస్పీఎస్సీ అధికారులు రద్దు చేశారు.
ఈ క్రమంలోనే ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన మిగతా రెండు పరీక్షలను వాయిదా వేశారు. ప్రవీణ్కు చెందిన 4 పెన్డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. గత నెల ఫిబ్రవరి 25న కాన్ఫిడెన్షియల్ సెక్షన్కు చెందిన కంప్యూటర్ లోకి చొరబడిన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి.. అందులోని పరీక్షా పత్రాలను పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకున్నారు. కంప్యూటర్లో ఎక్కువ ఫైల్స్ ఉండటంతో రాజశేఖర్రెడ్డి ప్రశ్నాపత్రాలను గుర్తించలేకపోయాడు. దీంతో అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం పెన్డ్రైవ్లలోకి బదిలీ చేశాడు. 4 పెన్డ్రైవ్లలో ఫైల్స్ని కాపీ చేసి వాటిని ప్రవీణ్కు ఇచ్చాడు.
పెన్డ్రైవ్లలోని సమాచారాన్ని ప్రవీణ్ తన కంప్యూటర్లోకి కాపీ చేసుకొని.. అందులో ఏఈ ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ చేసుకొని రేణుకకు ఇచ్చినట్లు తేల్చారు. రాజశేఖర్ ఫైల్స్ను కాపీ చేసే సందర్భంలో.. ఇప్పటికే ముగిసిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సైతం.. పెన్డ్రైవ్లోకి బదిలీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దానితో పాటు టౌన్ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్తో పాటు ఈ నెల చివర్లో జరగబోయే పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్లు తేలింది. ప్రవీణ్ ఎన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్నాడు.. వాటిలో ఏయే ప్రశ్నాపత్రాలు విక్రయించాడనే దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
ఏఈ పరీక్ష రద్దు: ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ కావడంతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో అనేది తొందరలోనే వెల్లడిస్తామని వివరించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి గత సంవత్సరం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 837పోస్టులకు 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 55,000 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రం లీకయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.