మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచింది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు న్యాయస్థానాన్ని శశికళ ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో ఆమె తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే లోపే అవినీతి కేసులో జైలుకెళ్లారు. దీంతో పళనిస్వామి సీఎం అయ్యారు. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయాయి. అనంతరం పళని, పన్నీర్ సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేశారు. అందులో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ నిర్ణయంపై 2017లో ఆమె న్యాయస్థానంలో దావా వేశారు.