తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2022, 7:12 PM IST

Updated : Dec 29, 2022, 11:04 PM IST

ETV Bharat / bharat

బుద్ధగయలో దలైలామా.. నిఘా పెట్టిన 'చైనా మహిళ'.. పోలీసులు అలర్ట్

బుద్ధ గయలో దలైలామా పర్యటన సందర్భంగా ఓ చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలవరం రేపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ మహిళ స్కెచ్‌తోపాటు పాస్‌పోర్టు, వీసా వివరాలను విడుదల చేశారు.

security-alert-in-bodh-gaya-amid-dalai-lamas-visit
బుద్ధ గయలో దలైలామా పర్యటన

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన బుద్ధగయకు చేరుకున్న ఆయన.. మూడురోజుల పాటు కొనసాగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఓ చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆమె పేరు సాంగ్‌ షియావోలాన్‌ అని పేర్కొన్న పోలీసులు.. ఆమె స్కెచ్‌ ఫొటోతో పాటు పాస్‌పోర్టు, వీసా వివరాలను విడుదల చేశారు. అయితే, ఎందుకు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. బౌద్ధ గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు ఆమె పన్నాగం పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

"చైనా నుంచి ఆ మహిళ 2020లో ధర్మశాలకు వచ్చింది. మహిళ వీసా.. 2024 వరకు చెల్లుబాటులో ఉంది కానీ వరుసగా 90 రోజులు భారత్​లో ఉండేందుకు అనుమతి లేదు. అందుకే ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటాం."

--గయా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్

వార్షిక పర్యటనలో భాగంగా బిహార్‌లోని బుద్ధగయ ఆలయానికి దలైలామా డిసెంబర్‌ 22నే చేరుకున్నారు. కొవిడ్‌ విజృంభణ కారణంగా రెండేళ్ల తర్వాత గయలో పర్యటిస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ 29, 30, 31 తేదీల్లో ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాలనుంచి దాదాపు 50,000 మంది బౌద్ధ సన్యాసులు వచ్చినట్లు అంచనా. తొలిరోజు కార్యక్రమంలో ప్రసంగించిన దలైలామా.. మనమంతా మనుషులుగా జన్మించామని, తాను ఎక్కడున్నా మానవత్వం కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు.

ఇదిలాఉంటే, కొన్నేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న దలైలామా.. చాలా సందర్భాల్లో చైనా నాయకత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరన్న ఆయన.. ముఖ్యంగా అక్కడ హాన్‌వర్గం ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉంటుందని చెప్పారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. తాను భారత్‌లోనే ఉంటానని, ఇక్కడే ప్రశాంతంగా ఉందని దలైలామా పలుసార్లు వెల్లడించారు. అందుకే ఆయనపై చైనా గుర్రుగా ఉంది.

Last Updated : Dec 29, 2022, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details