తెలంగాణ

telangana

By

Published : May 5, 2021, 5:16 AM IST

ETV Bharat / bharat

మరాఠా రిజర్వేషన్లపై నేడు సుప్రీం తీర్పు

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. బాంబే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించి, మార్చి 26న తీర్పు రిజర్వు చేసింది ధర్మాసనం.

SC MARATHA  QUOTA
మరాఠా రిజర్వేషన్లపై నేడు సుప్రీం తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. రిజర్వేషన్ల చెల్లుబాటును సమర్థిస్తూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించనుంది. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మార్చి 26న తీర్పు రిజర్వు చేసింది.

ఈ కేసుపై తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రిజర్వేషన్లను 16 శాతం కాకుండా.. ఉద్యోగాల్లో 12 శాతానికి, అడ్మిషన్లలో 13 శాతానికి కుదించాలని పేర్కొంది. అయితే రిజర్వేషన్లను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం వివరణను కోరగా.. రిజర్వేషన్లను సమర్థించింది. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. సామాజికంగా, విద్యా పరంగా వెనకబడినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని తెలిపింది.

మార్చి 15 నుంచి సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై వాదనలు ఆలకించింది. ఈ క్రమంలో 1992లో వెలువడిన ప్రఖ్యాత ఇందిరా సాహ్నీ కేసు తీర్పును పునఃసమీక్షించే అవసరముందా అనే అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఈ కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ అప్పట్లో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మారిన సామాజిక పరిస్థితులు, రాజ్యాంగ సవరణల నేపథ్యంలో ఈ తీర్పును విస్తృత ధర్మాసనంతో సమీక్షించాలని ప్రతిపాదిస్తున్నట్లు మరాఠా కేసులో విచారణ సందర్భంగా సుప్రీం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details