తెలంగాణ

telangana

మూడో ముప్పువేళ.. ఈ 'కాంవడ్' యాత్ర ఏంటి?

By

Published : Jul 14, 2021, 1:13 PM IST

కరోనా క్లిష్ట సమయంలో కాంవడ్ యాత్రకు ఎందుకు అనుమతులిచ్చారని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.

UP govt's decision to allow Kanwar Yatra
కాంవడ్ యాత్ర

కరోనా మూడోముప్పు(Corona third wave) పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ) ప్రభుత్వం కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని కోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.

జులై 25 నుంచి కాంవడ్‌ యాత్రకు యూపీ ప్రభుత్వం భక్తులను అనుమతించనుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో కాంవడ్ యాత్ర జరుగుతుందని మంగళవారం యూపీ ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ మాత్రం కాంవడ్ యాత్రను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కోట్లాది మంది పాల్గొనే మతపరమైన కార్యక్రమాలకు అనుమతులిస్తే కరోనా మూడోవేవ్‌కు అవకాశాలు పెరుగుతాయన్న వైద్య నిపుణుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 'ప్రజలు చనిపోవడాన్ని దేవుళ్లు కూడా కోరుకోరు' అంటూ ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు.

రెండో దఫా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. దాంతో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తిన దృశ్యాలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. దీనిపై స్వయంగా ప్రధాని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఆహ్వానిస్తేనే కరోనా వస్తుందని, వైరస్ నిబంధనలను ఉల్లంఘించ వద్దంటూ ప్రజలను హెచ్చరించారు.

ఇవీ చదవండి:కాంవడ్​ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్​ ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details