తెలంగాణ

telangana

తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

By

Published : Aug 18, 2021, 5:01 AM IST

Updated : Aug 18, 2021, 6:27 AM IST

రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. పది రోజుల్లోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయాలని, లేదంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

supreme court
సుప్రీంకోర్టు

రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సంక్షేమ నిధికి అందజేయాలని పేర్కొంది. పది రోజుల్లోపు కౌంటర్లు దాఖలుచేయకపోతే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, కోర్టుల రక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్‌ తరహాలో ప్రత్యేక భద్రత బలగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ కరుణాకర్‌ మహాళిక్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

సిద్ధంగా ఉన్నారా? లేదా?

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ న్యాయమూర్తులు, కోర్టుల భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, వాటిని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా? లేదా? అన్నదానిపై స్థాయీ నివేదికను కోరవచ్చని చెప్పారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ స్పందిస్తూ "కోర్టులు, న్యాయమూర్తులకు మీరు ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా?" అని ప్రశ్నించారు. అంతిమంగా మీరు ఏం చెబితే అది చేస్తామని మెహతా బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ "ఇవన్నీ పరిపాలన పరమైన అంశాలు. ఫలానాది చేయమని మేం సలహా ఇవ్వలేం. మీరు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయమూర్తుల భద్రతపై దేశవ్యాప్తంగా ఒకే విధానం గురించి నిర్ణయం తీసుకోవచ్చు" అని సూచించారు.

కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయలేదు..

మెహతా బదులిస్తూ "న్యాయమూర్తుల భద్రతకోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక దళం ఏర్పాటు సాధ్యం కాదు. భద్రత ఏర్పాట్లు స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి" అన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ మీరు రాష్ట్రాల కార్యదర్శులు, డీజీపీలను పిలిచి దీనిపై మాట్లాడవచ్చన్నారు. గత విచారణ సమయంలో కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రాలకు చెప్పామని, లేదంటే అలా దాఖలుచేసే హక్కును కోల్పోతాయని హెచ్చరించామని మెహతా తెలిపారు. కానీ ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయలేదని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చెప్పారు.

సీసీటీవీ కెమెరాలు అడ్డుకోలేవు..

అఫిడవిట్లు దాఖలుచేసిన రాష్ట్రాలన్నీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తుల భద్రత గురించి అసోం ఒక్కటే పూర్తిగా వెల్లడించిందని, మిగతా రాష్ట్రాలన్నీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామని చెప్పాయన్నారు. సీసీటీవీ కెమెరాలు నేరగాళ్లను అడ్డుకోలేవన్నారు. నిధులు లేవన్న పేరుతో రాష్ట్రాలు తప్పించుకోలేవన్నారు.

అఫిడవిట్లు దాఖలుచేయని రాష్ట్రాలు ఎప్పటిలోపు ఆ పని చేస్తాయని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అడిగినప్పుడు కేరళ, గోవా న్యాయవాదులు మాత్రమే హాజరై తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇంతవరకూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయని రాష్ట్రాలపై రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. పది రోజుల్లోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయాలని, లేదంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కౌంటర్ల దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఈ కేసులో పార్టీగా చేర్చాలని, అఫిడవిట్‌ దాఖలుచేయడానికి అనుమతినివ్వాలని ఆ సంస్థ అధ్యక్షుడు మనన్‌కుమార్‌ మిశ్ర కోరగా కోర్టు అంగీకరించింది.

ఇదీ చూడండి:'పెగసస్​పై కేంద్రం 10 రోజుల్లో సమాధానం చెప్పాలి'

Last Updated : Aug 18, 2021, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details