తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 2:35 PM IST

ETV Bharat / bharat

శశికళ గుడ్​బై​: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో, ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఊహించడం.. తలపండిన విశ్లేషకులకు సైతం ఒక్కోసారి అసాధ్యమైన విషయం. తాజాగా.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శశికళ చేసిన ప్రకటన కూడా అలాంటిదే. జైలు నుంచి విడుదలై ఇక తమిళనాట క్రియాశీల పాత్ర పోషిస్తారని భావించిన వేళ.. ఆమె తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇంతకీ... ఎందుకిలా? అధికార అన్నాడీఎంకే- భాజపా ప్రయత్నాలు ఫలించాయా? డీఎంకే తన వ్యూహాలకు మరింత పదునుపెట్టాలా? ఏఎంఎంకే అధినేత దినకరన్​ దారెటు? కమల్​ హాసన్​ కూటమిని ప్రకటిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Sasikala quits politics
శశికళ క్విట్​: 'అన్నాడీఎంకే'కు ఊరట- దినకరన్​కు నిరాశ!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చేసిన ప్రకటన తమిళ రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. అధికార ఆల్​ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినని ఇన్నాళ్లూ చెప్పుకున్న ఆమె ఇప్పుడు తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి... అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి.. ఇటీవలే విడుదలైన శశికళకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషిస్తారని భావించారంతా. కానీ అంచనాల్ని తలకిందులు చేస్తూ శశికళ రాజీ బాట పట్టారు.

శశికళ

ఇదీ చూడండి:రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ

'అన్నాడీఎంకే'కు కలిసొచ్చేనా?

శశికళ నిర్ణయం.. ఏప్రిల్​ 6న జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు 'అన్నాడీఎంకే'కు పెద్ద ఉపశమనం. ఆమె వైదొలగడం.. కొద్దో గొప్పో అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శశికళ విడిగా బరిలోకి దిగితే.. అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలిపోతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలేశారు. అయితే ఇలా జరగకూడదనే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

పళనిస్వామి

బుధవారం ఆమె చేసిన ప్రకటన చూస్తే ఇదే అర్థమవుతోంది. దివంగత జయలలిత మద్దతుదారులు అంతా ఐకమత్యంగా ఉండాలని.. తమ ప్రధాన ఏకైక శత్రువు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)ను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. 'పురచ్చి తలైవి స్వర్ణ పాలన' కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

భాజపా ప్రయత్నాలు ఫలించాయా? దెబ్బకొట్టాయా?

జైలు నుంచి విడుదలైన సమయంలో శశికళకు దక్కిన ప్రజాదరణ చూసి అన్నాడీఎంకే- భాజపా కూటమి ఒకింత కలవరానికి గురయ్యాయి. శశికళ.. తన మేనల్లుడు దినకరన్​ పార్టీ అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే)కు మద్దతిస్తారో, అన్నాడీఎంకేలోకి తిరిగి రావాలని చూస్తారోనని గందరగోళానికి గురయ్యాయి.

ఇదే తరుణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన భాజపా.. శశికళ వర్గంతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆమె కూటమి కోసం పనిచేయాలని, దినకరన్​ పార్టీని కూడా అన్నాడీఎంకేలో విలీనం చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ఎన్నికల వేళ.. శశికళ సంధి ప్రతిపాదన

మరి వారి రాజీ యత్నం ఫలించిందా? అంటే స్పష్టత లేదు. శశికళ.. డీఎంకేను ఓడించాలని చెప్పారు కానీ, అన్నాడీఎంకే కోసం పనిచేస్తానని ప్రకటించలేదు. ఆమె.. తన మేనల్లుడు దినకరన్​ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.

దినకరన్​కు మద్దతిస్తే..?

శశికళ తాజా నిర్ణయం కూటమికి కాస్త ఊరట కలిగించినప్పటికీ దీని వెనుక ఆంతర్యమేంటో అర్థం కావట్లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్​ సెల్వంకు.. శశికళతో భేదాభిప్రాయాలున్న వేళ ఆమె వీరి కోసం పనిచేస్తారని చెప్పడం కష్టమే. ఇదే సమయంలో.. శశికళ అనుచరులు, అభిమానులు దినకరన్​ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దినకరన్​

ఇదీ చూడండి:'శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు'

శశికళ నిర్ణయంతో నిరాశకు గురైనట్లు చెప్పిన దినకరన్​.. తన మేనత్త వైదొలిగినా ఏఎంఎంకే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. కొంతమేర నిరుత్సాహపడినా.. ఆమె తన వెన్నంటే ఉంటారని దినకరన్​ విశ్వాసంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చిన్నమ్మ నిర్ణయంపై దినకరన్ స్పందన

అన్నాడీఎంకే- భాజపాకు ఇప్పుడిదే భయం పట్టుకుంది. ఇలా కూడా ఓట్లు చీలిపోయి డీఎంకేకు లాభించే అవకాశాలున్నాయని కంగారు పడుతోంది.

ఈ నేపథ్యంలో శశికళ ఎటువైపు అడుగు వేస్తారనే విషయం విశ్లేషకులకే అంతుపట్టకుండా ఉంది.

శశికళ

ఇదీ చూడండి:శశికళ రాకతో అన్నాడీఎంకేలో కలవరం!

స్వాగతించిన భాజపా.. కానీ

శశికళ రాజకీయాల నుంచి తప్పుకోవడంపై స్పందించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​ మురుగన్​.. కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. డీఎంకే ఓటమి కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు.. అన్నాడీఎంకే డిప్యూటీ కో-ఆర్డినేటర్​ మాత్రం శశికళ నిర్ణయం అమ్మ ఆత్మను సంతృప్తి పరుస్తుందని అభిప్రాయపడ్డారు.

మరి డీఎంకే?

శశికళ తప్పుకోవడం.. తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రతిపక్ష డీఎంకే అవకాశాల్నీ దెబ్బతీస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దినకరన్​ పార్టీ కారణంగా.. ఓట్లు చీలితే తమకే నష్టమని స్టాలిన్ సేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లపై క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని చూస్తోంది.

స్టాలిన్​

2019 లోక్​సభ ఎన్నికల్లో డీఎంకే క్లీన్​స్వీప్​ చేసినా.. అన్నాడీఎంకేతో ఓట్ల వ్యత్యాసం తక్కువే. ఏఎంఎంకే మూడో స్థానం పొందడం విశేషం. ఈ పార్టీకి అప్పట్లో 8 శాతానికి పైగా ఓట్లొచ్చాయి. ఇది అన్నాడీఎంకేను దెబ్బకొట్టింది.

ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కూడా తలో నాలుగు చోట్ల డీఎంకే, అన్నాడీఎంకే గెలుపు అవకాశాలకు అడ్డు తగిలింది దినకరన్ పార్టీ. ఇప్పుడూ అదే తరహాలో ఏఎంఎంకే ప్రభావం చూపిస్తే ఎన్నికలకు ముందు ఫలితాలపై ఓ అంచనాకు రావడం తలపండిన నిపుణులకూ కష్టమే.

దీనిని దృష్టిలో పెట్టుకొని.. మరింత వ్యూహాత్మకంగా మెలగాలని డీఎంకే అధినేత స్టాలిన్​ చూస్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచి, కూటమిపై, సీట్ల పంపకంపై సరైన రీతిలో వ్యవహరిస్తే ఈసారి అధికారంలోకి రావొచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

రజనీ మద్దతు కోసం కమల్​..

మరోవైపు.. అనూహ్యంగా రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించిన దక్షిణాది సూపర్​స్టార్​ రజనీ కాంత్​ మద్దతు కోసం చూస్తున్నారు మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత, సినీ నటుడు కమల్​ హాసన్​. రజనీ అభిమానుల సంఘం- రజనీ మక్కల్​ మండ్రమ్​(ఆర్​ఎంఎం) సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.

కమల్​హాసన్​

ఆర్​ఎంఎంకు రాష్ట్రవ్యాప్తంగా 65 వేల శాఖలు ఉన్నాయి. తాను పార్టీ పెట్టాలని యోచించిన సమయంలో.. ఒక్కో దాంట్లో 30 మంది చొప్పున మొత్తం 19 లక్షల మందిని సంఘంలో చేర్చాలని పిలుపునిచ్చారు రజనీ. వీరు తలో 5 నుంచి 10 మందిని చేర్చినా.. కోటీ 25 లక్షలకు పైగా పార్టీలో చేరతారని భావించారు.

కమల్​హాసన్​

ఇప్పుడు వీరినే రజనీకాంత్​ మద్దతుతో తమవైపునకు తిప్పుకోవాలని ఆశిస్తున్నారు కమల్​. ఈ అంశమై పలుమార్లు రజనీని కలిశారు కూడా.

రజనీకాంత్​-కమల్​హాసన్​

ఇదీ చూడండి:ఎన్నికలకు ముందు రజనీని కలిసిన కమల్​హాసన్

ఒకవేళ కమల్​-రజనీ కలిస్తే రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఫలితాల అనంతరం.. ఎంఎన్​ఎం కీలకంగా మారుతుందని అంటున్నారు.

ఇప్పటివరకు కమల్​.. పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, తమ కూటమికి కమల్​ హాసనే​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని సమాత్తువ మక్కల్​ కాట్చి అధినేత శరత్​కుమార్​ ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి: ఎన్నికల బరిలో నటి రాధికా శరత్​కుమార్​

ఈ వరుస పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు మరోసారి అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పీఠం చేజిక్కించుకోవాలంటే.. చిన్న చిన్న పార్టీల మద్దతూ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ లెక్కల చిక్కులు వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

ఇవీ చూడండి:స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?

తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?

అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!

5 అసెంబ్లీల ఎన్నికల్లో గెలుపు గుర్రాలేవో!

తమిళ రాజకీయాల్లో 'వారు' మాయం- డీఎంకేకే లాభం!

ABOUT THE AUTHOR

...view details