Indian Origin Sai Varshith Case Update : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి శ్వేతసౌధం బారికేడ్లను ఢీకొన్న భారత సంతతి వ్యక్తి కందుల సాయి వర్షిత్ (19)కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష.. అలాగే రూ.2 కోట్లు(2,50,000 డాలర్లు) జరిమానా విధించే అవకాశముంది. బుధవారం ఫెడరల్ కోర్టు జడ్జి రాబిన్ మెరివెదర్ ఎదుట సాయి వర్షిత్ను హాజరుపరచగా.. మే 30వ తేదీ వరకు కస్టడీకి ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
Teen Crashes into White House with Truck in America : అమెరికాలోని మిసోరి రాష్ట్రానికి చెందిన యువకుడు(సాయి వర్షిత్) గత సోమవారం రాత్రి ఓ ట్రక్కు నడుపుతూ శ్వేతసౌధం దిశగా దూసుకుపోయి బారికేడ్లను ఢీకొనడంతో భద్రతా సిబ్బంది అతణ్ని నిర్బంధించిన విషయం విధితమే. అయితే ఈ ఘటనలో నిందితుడైన కందుల సాయి వర్షిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తెలుగు సంతతికి చెందిన యువకుడుగా గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి చూశాయి.
ఆరు నెలలుగా ప్లాన్ చేసి మరీ సాయి వర్షిత్ ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. విచారణలో అతను ఆ విషయాన్ని అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెండ్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే సాయి వర్షిత్ సోమవారం రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్లోని డ్యుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకొని, ఆ తరువాత యూ-హాల్ సంస్థ వద్ద ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్హౌస్ వెలుపల ఉన్న సైడ్వాక్ వద్దకు వెళ్లాడు.
అతన్ని చంపాలని ఆరు నెలలుగా ప్లాన్ చేశా :సాయి వర్షిత్శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేస్తూ వాటిని మరోసారి ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలకు ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. ఈ దాడి కోసం తాను ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు సాయి వర్షిత్ తెలిపాడు. అలాగే దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన వెంటతెచ్చుకున్న గ్రీన్బుక్లో రాసుకున్నట్లు తెలిపాడు.
Teen Crashes into White House with Truck in US :శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని నిందితుడు(సాయి వర్షిత్) చెప్పినట్లు అధికారులు తెలిపారు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అడగ్గా.. అవసరమైతే బైడెన్ను చంపాలనున్నానని చెప్పినట్లు వెల్లడించారు. అక్కడున్న వారిలో ఎవరినైనా గాయపర్చడమో, చంపడమో చేయాలనుకున్నానని అతను అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.
సాయి వర్షిత్ మానసిక పరిస్థితిపై పోలీసులు ఆరా..: యువకుడి వద్ద ఉన్న నాజీ జెండాను అధికారులు స్వాధీనం చేసుకుని, దాని గురించి అతణ్ని ప్రశ్నించగా.. తాను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు నిందితుడు(సాయి వర్షిత్) చెప్పుకొచ్చాడు. హిట్లర్ బలమైన నేతని.. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని నిందితుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతని(సాయి వర్షిత్) మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వివరాల కోసం యువకుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: