తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 3:24 PM IST

ETV Bharat / bharat

'ఇకపై మాస్క్​ లేకుంటే రూ. 2వేలు కట్టాల్సిందే'

దిల్లీలో కరోనా నివారణకు చర్యలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. మాస్కు లేకుంటే రూ.500గా ఉన్న జరిమానాను రూ.2 వేలకు పెంచింది. కరోనా రోగుల చికిత్స కోసం 1400 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​. అఖిలపక్ష భేటీ అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Rs 2,000 fine for not wearing mask in Delhi: Kejriwal
'దిల్లీలో మాస్క్​ లేకుంటే రూ. 2000 కట్టాల్సిందే'

దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేజ్రీవాల్​ సర్కార్​ కఠిన చర్యలకు ఉపక్రమించింది. మాస్కు ధరించని వారిపై ప్రస్తుతం రూ. 500గా ఉన్న జరిమానాను రూ. 2 వేలకు పెంచింది. దిల్లీలో కరోనా విజృంభణపై సీఎం అధ్యక్షతన అత్యవసర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆప్, భాజపా, కాంగ్రెస్ నేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​. గురువారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో 80 శాతం పడకలను కొవిడ్​ రోగులకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అనంతరం.. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

'' దిల్లీలో ఎక్కువ మంది మాస్కులు ధరిస్తున్నా.. ఎక్కడో చోట కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇకపై ఎవరైనా మాస్కు ధరించకుంటే రూ. 2000 జరిమానా చెల్లించాల్సిందే. మాస్కు ధరిస్తే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు. మాస్కులు పంపిణీ చేయాలని.. సామాజిక, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.''

- కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

కరోనా రోగుల చికిత్స కోసం 1400 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేజ్రీవాల్​. ఛట్‌పూజను చెరువులు, నదులు, సరస్సుల వద్ద జరుపుకోరాదని ప్రజలను కోరారు.

'పరీక్షలు పెంచండి'

కరోనా పరీక్షలు పెంచేందుకు దిల్లీ ప్రభుత్వం.. అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లా న్యాయాధికారులు, జిల్లా ముఖ్య వైద్యాధికారులు వెంటనే.. తమ పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆదేశించింది. కొత్త పరీక్షా కేంద్రం ఎక్కడ నెలకొల్పాలో ఇవాళ సాయంత్రానికి గుర్తించాలని.. పరీక్షా కేంద్రాల సంఖ్యను నవంబర్ 21 నాటికి పెంచాలని స్పష్టం చేసింది.

దిల్లీలో కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 131 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details