Rohtak ATM robbery: హరియాణాలోని రోహ్తక్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఏటీఎం క్యాష్ వ్యాన్ను దోచుకున్నారు. వ్యాన్ గార్డుపై దాడి చేసి.. రూ.2.62 కోట్లతో పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఏటీఎం క్యాష్ వ్యాన్ సెక్టార్ 1 మార్కెట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకుల ఏటీఎం యంత్రాలలో సిబ్బంది డబ్బులు నింపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు రమేశ్ అనే సెక్యూరిటీ గార్డును వెనక నుంచి కాల్చారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
కాల్పులు జరగగానే.. ఏటీఎంలలో నగదు నింపుతున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దుండగులకు భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. దీంతో దొంగల పని సులభమైంది. నగదు పెట్టల్లో నుంచి రూ.2.62 కోట్లను తీసుకొని దుండగులు పరారయ్యారు. ఏటీఎం యంత్రాలలో నింపేందుకు మొత్తం రూ.2.92 కోట్లను తీసుకొచ్చామని సిబ్బంది తెలిపారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డు రమేశ్ను పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.