Road Accident in Adilabad District : ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్నప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్వతహాగా ఆటోనడిపే పోచన్న.. తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి నిన్న సాయంత్రం ఇచ్చోడలోని చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం, రాత్రి అక్కడే ఉన్న వీరంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారిపై ఆటో వస్తుండగా.. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Adilabad Road Accident Today : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి - Gudihatnoor mandal latest news

07:31 July 08
ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం
వేగంగా ఢీకొట్టిన కారణంగా రోడ్డు పక్కనున్న డ్రైనేజీలో ఆటోపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న పోచన్నతో పాటు భార్య గంగమ్మ, కూతురు శైలజ, కుటుంబసభ్యురాలు సోంబాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రేంసాగర్, తేజవర్ధన్, దీపక్ అనే యువకులతో పాటు రెండేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో రోడ్డు పక్కన డ్రైనేజీలో పడిపోవటం, క్షతగాత్రులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో పాటు.. చీకటిగా ఉండటంతో ఎవరూ గుర్తించలేదు.
Adilabad Road Accident Today :తెల్లవారుజామున ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్కు తరలించిన పోలీసులు.. మృతదేహాలను అక్కడి మార్చురీకి పంపించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు... ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. చర్చికి ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో నలుగురు కుటుంబసభ్యులు చనిపోవటంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ఇదే మార్గంలో తరచుగా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు బాగు చేయాలని ఎన్ని సార్లు వేడుకున్నా పట్టించుకోకపోవటంతోనే ప్రాణాలు పోతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు.
ఇవీ చదవండి: