తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2022, 4:17 PM IST

Updated : Nov 24, 2022, 6:01 PM IST

ETV Bharat / bharat

నటి పోస్ట్​పై నెట్టింట దుమారం.. గల్వాన్​ ప్రస్తావనే కారణం!

బాలీవుడ్‌ నటి రిచా చద్దా నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన ట్వీట్‌లో గల్వాన్‌ ప్రస్తావన తేవడమే.. తాజా ట్రోలింగ్‌కు కారణంగా మారింది. రిచా సైన్యాన్ని అవమానించారని భాజపా, శివసేన పార్టీలు మండిపడ్డాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఇంతకీ.. రిచా చద్దా చేసిన ట్వీట్‌ ఏమిటి?. ఎందుకు వివాదాస్పదంగా మారింది?. నటి క్షమాపణలు చెప్పడానికి.. దారితీసిన పరిస్థితులేంటి?. ఈ స్టోరీలో తెలుసుకుందాం!

Richa Chadha latest tweet
రిచా చద్దా

బాలీవుడ్‌ నటి రిచా చద్దా చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. పాక్‌ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంపై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను.. రీట్వీట్‌ చేస్తూ ఆమె పెట్టిన సందేశం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు.. పాక్‌ ఆక్రమిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం సిద్ధంగా ఉంటుందని నార్తర్న్‌ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలను ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ను కోట్‌ చేసిన నటి రిచా చద్దా.. 'గల్వాన్‌ సేస్‌ హాయ్‌' అంటూ రీట్వీట్‌ చేశారు. ఇది దుమారానికి దారితీసింది. సైన్యాన్ని కించపరిచేలా నటి ట్వీట్‌ ఉందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.

ఓ నెటిజన్​ చేసిన ట్వీట్​కు స్పందించిన నటి రిచా చద్దా

రిచా చేసిన ట్వీట్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఆమె ట్వీట్‌పై భాజపా.. శివసేన పార్టీలు మండిపడ్డాయి. ఆర్మీని అవహేళన చేసేలా వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లీ విమర్శించారు. ట్వీట్‌లో గల్వాన్ ప్రస్తావన తెచ్చి జోక్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని నళిన్ కోహ్లీ కోరారు. మరో భాజపా నాయకుడు.. మంజిత్‌ సింగ్ సిర్సా కూడా నటి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సైన్యాన్ని అవమానించటం.. సమర్థనీయం కాదని మండిపడ్డారు. అటు శివసేన సైతం.. నటి ట్వీట్‌పై ఘాటుగా స్పందించింది. ఈ తరహా దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై.. నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.

రిచా ట్వీట్​పై స్పందించిన నెటిజన్​లు

మరోవైపు రిచా చద్దా ట్వీట్‌పై బాలీవుడ్‌ నిర్మాత అశోక్‌ పండిట్‌.. ముంబయిలోని జుహూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన వారిని నటి అవమానించారని మండిపడ్డారు. నటిపై.. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో నటి రిచా చద్దా స్పందించారు.

భాజపా నాయకుడు మంజిత్‌ సింగ్ సిర్సా ట్వీట్​

తన ట్వీట్‌లో గల్వాన్‌ ప్రస్తావన తేవడమే తాజా ట్రోలింగ్‌కు కారణమని అభిప్రాయపడ్డారు. ఎవర్నీ బాధించాలన్నది తన ఉద్దేశం కాదన్న రిచా.. ఆ మూడు పదాలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని టీట్‌ చేశారు. తన తాత కూడా సైన్యంలో పనిచేశారన్న ఆయన.. చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్లు తెలిపారు. ఆయన రక్తమే.. తనలోనూ ప్రవహిస్తోందని చెప్పారు. ఈ మేరకు పాత ట్వీట్‌ను తొలగిస్తూ.. కొత్త ట్వీట్‌ను రిచా పోస్టు చేశారు.

క్షమాపణలు కోరుతూ రిచా పోస్ట్​ చేసిన రెండో ట్వీట్​
Last Updated : Nov 24, 2022, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details